మద్యం షాపులను ప్రభుత్వం వదిలించుకుంటోందా ?

తొందరలోనే మద్యం షాపులను ప్రభుత్వం వదిలించుకోబోతోందనే ప్రచారం మొదలైంది. గతంలో ఉన్నట్లే షాపులన్నింటినీ మళ్ళీ ప్రైవేటు వ్యక్తులకే అప్పగించేయాలని జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో డిసైడ్ అయ్యిందట. ఇంతటి కీలక నిర్ణయానికి కారణం ఏమిటంటే మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవటమేనట. ప్రస్తుతం మద్యం ద్వారా ఆదాయం బాగానే వస్తున్నా అనుకున్నంత స్ధాయిలో రావటం లేదని ఉన్నతాధికారులు బాధపడిపోతున్నారట.

ప్రస్తుతం మద్యం ద్వారా ఏడాదికి సుమారు రు. 25 వేల కోట్లు వ్యాపారం జరుగుతోంది. ఇందులో నుండి సుమారు రు. 20 వేల కోట్ల ఆదాయం వస్తోంది. అయితే అంచనా వేసిన దానికన్నా వస్తున్నది తక్కువగానే ఉన్నట్లు ఉన్నతాధికారులు జగన్ తో చెప్పారట. మరి అంచనాలకు తగ్గట్లు లేదా అంతకన్నా ఎక్కువగా ఆదాయం రావాలంటే ఏమి చేయాలి ? ఏమి చేయాలంటే వెంటనే మద్యం షాపుల నిర్వహణ నుండి ప్రభుత్వం తప్పుకుని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ఉన్నతాధికారులు సూచించారట.

ప్రభుత్వమే నిర్వహించటానికి, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించటానికి మధ్య తేడా ఉంది. షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తోంది కాబట్టి డిపాజిట్లు ఉండవు. అలాగే మద్యం అమ్మకాలకు ప్రభుత్వం కొన్ని పరిమితులను పెట్టుకున్నది. అదే ప్రైవేటువ్యక్తులకు షాపులను అప్పగిస్తే వారినుండి దరఖాస్తు, డిపాజిట్ల పేరుతో సుమారు రు. 2 వేల కోట్లు వస్తుంది.

అలాగే నెలకు ఇపుడు మద్యం అమ్మకాల ద్వారా రు. 2 వేల కోట్లువస్తోంది. దీన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే అమ్మకాలు డబల్ అంటే రు. 4 వేల కోట్లకు పెరిగే అవకావముంది. మద్యం ఎంత ఎక్కువగా అమ్ముడుపోతే ప్రభుత్వానికి ఆదాయం అంత ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇపుడు వస్తున్న ఆదాయంకన్నా ప్రైవేటువ్యక్తులకు అప్పగిస్తే సుమారు రు. 5 వేల కోట్లు అదనపు ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.