పార్టీల మధ్య ‘ఆరా’ కొత్త చిచ్చు

అసలే మూడు ప్రధాన పార్టీల మధ్య వ్యవహారం ఉప్పు-నిప్పులాగుంది. మళ్ళీ అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని ఒకవైపు టీఆర్ఎస్ గట్టి ప్రయత్నాల్లో ఉంది. ఇదే సమయంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం తమదే అని బీజేపీ సవాళ్ళ మీద సవాళ్ళు చేస్తంది. వీళ్ళద్దరు కాదు అధికారం మాదే అని కాంగ్రెస్ నేతలు తొడలు చరుస్తున్నారు. దీంతో తెలంగాణాలో రాజకీయ వేడితో వాతావరణమంతా బాగా కాలుష్యమైపోయింది.

సరిగ్గా ఇలాంటి నేపధ్యంలోనే ఆరా అనే సర్వే సంస్ధ సర్వే ఫలితాలను విడుదలచేసింది. అందులో టీఆర్ఎస్సే మళ్ళీ అధికారంలోకి రాబోతోందని చెప్పింది. ఇదే సమయంలో బీజేపీ ఓట్లషేరును గణనీయంగా పెంచుకోబోతోందని కూడా చెప్పింది. పనిలోపనిగా కాంగ్రెస్ ఓట్ల శాతం తగ్గిపోతోందని ప్రకటించింది. ఈ మూడు పరస్పర విరుద్ధమైన ఫలితాల కారణంగా మూడు పార్టీల మధ్య గొడవలు మరింతగా పెరిగిపోయాయి.

జనాల మైండ్ సెట్ మార్చేందుకు బీజేపీయే ఆరా సంస్ధతో ఒక బోగస్ సర్వే ఫలితమని చెప్పి రిలీజ్ చేయించిందని టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు మొదలుపెట్టారు. పోటీచేయటానికి 119 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులే లేని పార్టీకి 30 శాతం ఓట్లు ఎలావస్తాయని కారుపార్టీ నేతలు నిలదీస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు కూడా ఎదురుదాడులకు దిగారు. కేసీయారే ఆరా సంస్ధతో ఒక బోగస్ సర్వే చేయించారని చెప్పారు. ప్రజావ్యతిరేకత విపరీతంగా కనబడుతుంటే మళ్ళీ టీఆర్ఎస్ ఎలాగ అధికారంలోకి వస్తుందని నిలదీస్తున్నారు.

ఈ రెండుపార్టీలను కాంగ్రెస్ నేతలు దుమ్ము దులిపేస్తున్నారు. ఆరా సంస్ధను టీఆర్ఎస్, బీజేపీ నేతలు మ్యానేజ్ చేసి కాంగ్రెస్ ఓట్లశాతం తగ్గిపోతోందని ఉద్దేశ్యపూర్వకంగానే చెప్పించారంటు మండిపడుతున్నారు. ఆరా సంస్ధ యాజమాన్యం పై రెండుపార్టీల కోసమే పనిచేస్తోందంటు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేసీయార్, నరేంద్రమోడీ పైన వ్యతిరేకత కారణంగా అధికారంలోకి రాబోయేది తామేనంటు కాంగ్రెస్ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ సర్వేను తాము నమ్మేదిలేదని కూడా అంటున్నారు. మొత్తానికి మూడుపార్టీల మధ్య సర్వే చిచ్చు బాగానే రగులుతోంది.