కాగ‌ల కార్యం రేవంత్ తీర్చిన‌ట్లు.. కేసీఆర్ బిందాస్‌..!

తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త ఎత్తుగ‌డ‌కు తెర‌దీశారా..? కాగ‌ల కార్యం గంధ‌ర్వులు తీర్చిన‌ట్లు త‌ను కోరుకుంది టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ అమ‌లు చేస్తున్నారా..? త‌న చేతికి మ‌ట్టి అంట‌కుండానే రేవంత్ కానిచ్చేస్తున్నారా..? కేసీఆర్ వ్యూహంలో రేవంత్ చిక్కుకుపోయారా..? త‌న‌కి తెలియ‌కుండానే ప‌రోక్షంగా కేసీఆర్ కు స‌హ‌క‌రిస్తున్నారా..? అంటే అవున‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

అది పార్టీలో చేరిక‌ల విష‌యంలో కేసీఆర్ భారాన్ని రేవంత్‌ త‌గ్గిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో కారు ఓవ‌ర్ లోడ్ అయిన విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీఆర్ఎస్ లో ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ కోసం ఐదారుగురు క్యూలో నిల‌బ‌డ్డారు. విడ‌వ‌మంటే పాముకు కోపం.. క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం అన్న‌ట్లుగా ఒక‌రికి టికెట్ వ‌స్తే మిగ‌తా వారు స‌హ‌క‌రించే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు.

వాస్త‌వానికి 2018 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు కావాల్సిన మెజారిటీ కంటే ప్ర‌జ‌లు ఎక్కువే క‌ట్ట‌బెట్టారు. ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే 60 స్థానాలు అవ‌స‌ర‌మ‌వ‌గా గులాబీ పార్టీ 88 స్థానాల్లో విజ‌య‌దుందుభి మోగించి ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో నిలిచింది. అయినా కేసీఆర్ ఇంత‌టితో సంతృప్తి ప‌డ‌లేదు. రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ పేరిట వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించి ప్ర‌తిప‌క్షాల‌ను బ‌ల‌హీన‌ప‌రిచారు.

కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేల‌ను, టీడీపీ నుంచి గెలిచిన ఇద్ద‌రిని కారులో ఎక్కించుకున్నారు. అంత‌టితో ఆగ‌కుండా స‌బిత‌, త‌ల‌సాని వంటి స‌మైక్య‌వాదుల‌కు మంత్రి ప‌దవులు క‌ట్ట‌బెట్టారు. దీంతో ఉద్య‌మ‌కారుల్లో, తెలంగాణ స‌మాజంలో తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మైంది. ముఖ్యంగా టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఓడిపోయిన స్థానాల్లో ఇతర పార్టీ వ్య‌క్తులు వ‌చ్చి చేర‌డంతో కారు ఓవ‌ర్ లోడ్ అయింది.

పాత‌, కొత్త వ్య‌క్తుల వ‌ర్గాల‌తో జ‌గ‌డం మొద‌లైంది. ఈసారి టికెట్ త‌మ‌ది అంటే త‌మ‌ద‌ని బ‌హిరంగంగానే గ‌లాటాల‌కు దిగుతున్నారు. తుమ్మ‌ల‌-కందాళ‌, ప‌ట్నం-రోహిత్ రెడ్డి, జూప‌ల్లి-బీరం, హ‌రిప్రియ‌-కోరం క‌న‌క‌య్య‌, చిరుమ‌ర్తి-వేముల, స‌బిత‌-తీగ‌ల‌ ఇలా దాదాపు అన్ని జిల్లాల్లో గ్రూపు రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. మ‌రికొంద‌రైతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ వ‌స్తుందో లేదోన‌న్న అనుమానంతో ముందే కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.

మాజీ ఎమ్మెల్యేలు న‌ల్లాల ఓదెలు, రావి శ్రీ‌నివాస్‌, బోడ జ‌నార్ద‌న్‌, తాటి వెంక‌టేశ్వ‌ర్లు, బాలు నాయ‌క్‌, ఎర్ర శేఖ‌ర్‌, విజ‌యారెడ్డి త‌దిత‌ర కీల‌క నేత‌ల‌కు రేవంత్ హ‌స్తం కండువా క‌ప్పారు. మ‌రికొంద‌రు ముఖ్య నేత‌ల‌తో కూడా సంప్ర‌దింపులు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, తీగ‌ల కృష్ణారెడ్డి, జూప‌ల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి త‌దిత‌ర కీల‌క నేత‌లు పార్టీ వీడ‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయినా టీఆర్ఎస్ మౌనంగా చూస్తూ ఉండిపోయింది.

అయితే.. ఇదంతా వ్యూహంలో భాగ‌మేన‌ని.. పార్టీ నుంచి ఎంత‌మంది వెళ్లిపోతే అంత కారు బరువు దిగిపోతుంద‌ని.. మిగ‌తా వారికి టికెట్లు సులువుగా స‌ర్దుబాటు చేయొచ్చ‌నే ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్నార‌ట‌. త‌న చేతికి మ‌ట్టి అంట‌కుండా ప‌రోక్షంగా రేవంత్ స‌హ‌కారం అందిస్తున్నార‌నే భావ‌న‌లో టీఆర్ఎస్ టీం ఉంది. ఇదేమీ తెలియ‌క రేవంత్ ఇబ్బ‌డి ముబ్బ‌డిగా నేత‌ల‌ను పార్టీలో చేర్చుకుంటున్నార‌ని.. ఇక అక్క‌డా కొత్త పంచాయితీ మొద‌లైతే అది త‌మ‌కే లాభిస్తుంద‌ని గులాబీ పార్టీ భావిస్తోంది. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!