షర్మిలకు అంత సీనుందా ?

క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలను చూసిన తర్వాత అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ కు వైఎస్సార్టీపీ గ్రహణం పడుతుందనే చర్చ పెరిగిపోతోంది. కాంగ్రెస్ కు షర్మిల పార్టీ గ్రహణం పట్టడం ఏమిటి ? ఏమిటంటే షర్మిల పార్టీ సొంతంగా ఎక్కువ నియోజకవర్గాల్లో గెలవలేకపోవచ్చు. కానీ దాని ప్రభావం కాంగ్రెస్ విజయావకాశాలపై తప్పకుండా పడుతుందనే చర్చ పెరిగిపోతోంది.

దీనికి హేతువు ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్న సునీల్ కానుగోల ఒక రిపోర్టు ఇచ్చారట. దాని ప్రకారం ఖమ్మం, నల్గొండ, గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మద్దతుదారులు, అభిమానుల ప్రభావం ఎక్కువగా ఉందని తేలిందట. వీళ్ళమద్దతు ఎక్కువగా షర్మిల పార్టీవైపు ఉండే అవకాశముందని సర్వేలో తేలిందట. ఆ విషయాన్నే సునీల్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి స్పష్టంగా చెప్పారట.

వచ్చే ఎన్నికల్లో 70 సీట్లతో అధికారంలోకి వచ్చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. మరీ నేపధ్యంలోనే కాంగ్రెస్ విజయాన్ని షర్మిల దెబ్బకొడుతుందేమో అనే టెన్షన్ మొదలైందట. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రత్యేకించి షర్మిలను పిలిచారు. ఇదే రేవంత్ ఒకపుడు షర్మిల పార్టీని ఒకపార్టీగా గుర్తించటానికే ఇష్టపడని విషయం తెలిసిందే.

షర్మిల పార్టీనుండి కాంగ్రెస్ కు ఓట్లు గండిపడితే గెలుపు అవకాశాలు తగ్గిపోవటం ఖాయం. దాంతో మళ్ళీ ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండేంత ఓపిక కాంగ్రెస్ నేతలకు లేదన్నది వాస్తవం. ఈ పరిస్ధితిని నివారించేందుకు కాంగ్రెస్-షర్మిల మధ్య పొత్తుకుదిరే అవకాశముందనే ప్రచారం పెరుగుతోంది. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ పై అవినీతిపరుడిగా ముద్రవేసి, కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డిపైన కేసులు నమోదుచేసి 16 మాసాలు జైలులో ఉంచిన కాంగ్రెస్ పార్టీతో ఇపుడు షర్మిల పొత్తు పెట్టుకుంటారా అనే సందేహాలు కూడా ఉన్నాయి. చూద్దాం చివరకు ఏమవుతుందో.