కేసీయార్ లో టెన్షన్ పెంచేస్తున్నారా ?

ముందస్తు ఎన్నికల విషయంలో కేసీయార్ పై రెండు ప్రధాన పార్టీలు బాగా టెన్షన్ పెంచేస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు నరేంద్ర మోడీ రెడీ అయితే తెలంగాణలో కూడా ముందస్తు ఎన్నికలకు తాము రెడీ అంటు కేసీయార్ సవాలు విసిరారు. దాంతో కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గట్టిగా తగులుకున్నారు. వీళ్ళద్దరు ఎప్పటినుండో ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊదరగొడుతున్నారు. దానికి తాజాగా కేసీయార్ చేసిన చాలెంజ్ మరింత ఊపునిచ్చినట్లయ్యింది.

కేసీయార్ చేసిన చాలెంజితో సంబంధాలు లేకుండా రేవంత్, బండి ఇద్దరు కూడా ముందస్తు ఎన్నికలకు తాము రెడీ అంటూ స్పందించారు. నిజంగానే గెలుపుపై కేసీయార్ కు విశ్వాసముంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాల్సిందే అని పదే పదే ఎదురు చాలెంజులు చేస్తున్నారు. దీంతో తెలంగాణాలో ముందస్తు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. ఎన్నికలు ముందస్తు జరిగినా షెడ్యూల్ ప్రకారం జరిగినా కేసీయార్ ఓటమి ఖాయమని పై రెండు పార్టీల నేతలు పదే పదే చెబుతున్నారు.

దీనికి తగ్గట్లే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) నిర్వహించిన సర్వేలో అధికారపార్టీకి కష్టకాలం తప్పదని ఫీడ్ బ్యాక్ వచ్చినట్లు బాగా ప్రచారం జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ లోని చాలామంది సిట్టింగ్ ఎంఎల్ఏలపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని సర్వేలో తేలిందట. కనీసం సగంమంది ఎంఎల్ఏలేను మారిస్తే కానీ ఉపయోగముండదని పీకే తన రిపోర్టులో స్పష్టంగా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగానే చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంఎల్ఏలకు ప్రత్యామ్నాయాలను కేసీయార్ అన్వేషిస్తున్నారు.

ఎప్పుడైతే ఈ విషయం బయటపడిందో అప్పటినుండి రేవంత్, బండి రెచ్చిపోతున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీఆర్ఎస్ ఓటమి ఖాయమని ఊదరగొట్టడం మొదలుపెట్టారు. నిజంగానే ముందస్తు ఎన్నికలు జరిగితే లాభపడేది ఎవరో స్పష్టంగా చెప్పలేకపోయినా కేసీయార్ కేంద్రంగా ఎన్నికల హీట్ పెరిగిపోతోందన్నది వాస్తవం. మొత్తానికి ముందస్తు ఎన్నికలను అనవసరంగా కేసీయార్ కెలుక్కున్నట్లయ్యిందనే అనిపిస్తోంది.