వైసీపీ ప్లీన‌రీలో చంద్ర‌బాబు జ‌పం.. వైఎస్‌ను మించి మ‌రీ..!

వైసీపీ నిర్వ‌హించిన ప్లీన‌రీలో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెర‌మీదికి వ‌చ్చాయి. ఈ ప్లీన‌రీని వాస్త‌వానికి జ‌గ‌న్ తండ్రి, దివంగ‌త సీఎం రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని నిర్వ‌హించారు. అయితే.. దీనిలో ఆయ‌న పేరు క‌న్నా.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు జ‌పంతోనే వైసీపీ నాయ‌కులు త‌రించార‌నే కామెంట్లు వ‌స్తున్నాయి. రెండో రోజు జ‌రిగిన ప్లీన‌రీలో ఏకంగా 100 సార్ల‌కు పైగా చంద్ర‌బాబుపేరును త‌లుచుకోగా.. కేవ‌లం ప‌ది 15 సార్లు మాత్ర‌మే వైఎస్ పేరును స్మ‌రించ‌డం గ‌మ‌నార్హం. దీంతో ప్లీన‌రీ అంతా.. ఎవ‌రి నోట విన్నా.. చంద్ర‌బాబు పేరే వినిపించ‌డం గ‌మ‌నార్హం.

అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత వైసీపీ ‘ప్లీనరీ’ నిర్వహించింది. ఒకవైపు ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, మరోవైపు సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి, ఇంకోవైపు టీడీపీ మహానాడు, మినీ మహానాడు కార్యక్రమాలు విజయవంతమైన నేపథ్యంలో… ఒకవిధమైన ఒత్తిడితో కూడిన వాతావరణంలో వైసీపీ ప్లీనరీ ముగిసింది. ఈ ప్లీనరీలో జగన్‌తోపాటు వైసీపీ నేతలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు సమావేశాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ప్లీనరీలో సీఎం జగన్ ఆక్రోశంతో ఊగిపోయారు.

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు వైసీపీ నేతలు మీడియా, ప్రతిపక్ష నేతలపై పడ్డారు. ప్లీనరీ ఉద్దేశం, పార్టీ విస్తరణ, ప్లీనరీ తీర్మానాలు ఇవన్నీ పట్టించుకోకుండా చంద్రబాబుపై విషాన్ని కక్కారు. ఒకటి రెండు కాదు ఏకంగా వంద సార్లు చంద్రబాబు పేరును ప్రస్తావించారు. దీన్నిబట్టి వైసీపీ నేతలు ఎంత ప్రస్టేషన్‌లో ఉన్నారో అర్థమవుతోందని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. రెండు రోజుల వైసీపీ ప్లీనరీలో చంద్రబాబు పేరును 100 సార్లకన్నా ఎక్కువ‌గానే వైసీపీ నేతలు పలికారు. ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుపేరు 80 సార్లు, ABN రాధాకృష్ణ పేరు 70 సార్లు ప్రస్తావించారు.

TV5 నాయుడి పేరు 60 సార్లు, దుష్టచతుష్టయం పేరు 50 సార్లును వైపీసీ నేతల నోట వినిపించాయి. దత్తపుత్రుడు(ప‌వ‌న్‌) పేరు 40 సార్లు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ABN, TV5 పేర్లు(క‌లిపి) 30 సార్లు ప్రస్తావించారు. టీడీపీ నేత లోకేష్ పేరు 20 సార్లు పలికారు. వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ తండ్రి వైఎస్‌ఆర్‌ పేరుని కేవలం 10 సార్లు మాత్రమే నేతలు ప్రస్తావించారు. పార్టీ దిశానిర్దేశం, కార్యచరణపై చర్చించాల్సిన ఈ ప్లీనరీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు పేరుని ఏకంగా 100 సార్లు పలకడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు పేరుని పలికిన తీరుని బట్టి వైసీపీ నేతల తీరును అర్ధం చేసుకోవచ్చునని చెబుతున్నారు.