మెల్లిగా పార్టీనీ లాగేసుకుంటున్నారా ?

మహారాష్ట్ర శివసేన లో రెండో అంకానికి తెర లేచింది. ముందేమో పార్టీ చీఫ్ ఉద్థవ్ థాక్రే పై తిరుగుబాటు లేవదీసిన ఏక్ నాథ్ షిండే పార్టీని నిట్టనిలువుగా చీల్చేశారు. పార్టీకి చెందిన 55 మంది ఎంఎల్ఏల్లో 40 మంది షిండే వర్గంలోకి వెళ్ళిపోయారు. బీజేపీ మద్దతుతో ఉద్థవ్ ప్రభుత్వాన్ని దింపేసి షిండే ఏకంగా ముఖ్యమంత్రయిపోయారు. సో థాక్రే నుండి ప్రభుత్వాన్ని లాగేసుకున్న షిండే నెక్స్ట్ స్టెప్ ఏమిటి ?

నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే పార్టీని లాగేసుకోవటమే అంటున్నారు. ఇందులో భాగంగానే ధానే మున్సిపల్ కార్పొరేషన్లోని కార్పొరేటర్లను లాగేసుకున్నారు. కార్పొరేషన్లో 67 మంది కార్పొరేట్లుంటే 66 మంది షిండేకి జై కొట్టారు. థానే కార్పొరేషన్ను లాగేసుకోవటం షిండేకి పెద్ద విషయమేమీ కాదు. ఎందుకంటే థానే జిల్లా చాలా కాలంగా షిండే చేతిలోనే ఉంది. శివసేనకు సంబంధించి మొత్తం రాష్ట్రమంతా ఎలా జరిగినా థానే జిల్లాలో మాత్రం షిండే చెప్పిందే శాసనం.

సో, నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే ముంబయ్ మున్సిపల్ కార్పొరేషనే అయ్యుండచ్చు. ముంబయ్ కార్పొరేషన్ను గనుక షిండే లాగేసుకుంటే దాదాపు రాష్ట్రమంతా లాగేసుకున్నట్లే లెక్క. రాష్ట్రంలోని రెండు అతిపెద్ద కార్పొరేషన్లు షిండే ఖాతాలో పడిన తర్వాత మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటిలను లాగేసుకోవటం పెద్ద కష్టం కాదు. అంటే గ్రామస్ధాయిలోని ప్రజాప్రతినిధుల నుండి ఎంఎల్ఏలు, ఎంపీల దాకా షిండేకే జై కొట్టినాక ఇక పార్టీ కమిటిలు జై కొట్టడం ఎంతసేపు ?

సో జరుగుతున్నది చూస్తుంటే మెల్లిగా పార్టీ మొత్తాన్ని షిండే లాగేసుకునేట్లే కనబడుతున్నారు. తన వెనకాల పెద్ద కొండలాగ బీజేపీ అండ ఉన్నపుడు షిండే దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైన సాంకేతిక, న్యాయపరమైన సమస్యలన్నింటినీ బీజేపీయే చూసుకుంటుంది. ఎందుకంటే బీజేపీకి కావాల్సింది షిండే చేతికి శివసేన రావటం కాదు. ఉద్థవ్ థాక్రేని లేవకుండా దెబ్బకొట్టడం. అంటే షిండేని అడ్డుపెట్టుకుని థాక్రేని దెబ్బకొడుతోంది. రేపు ఏదైనా తేడా వస్తే మళ్ళీ ఇలాగే షిండేని కూడా కొట్టేస్తుందనటంలో సందేహమే లేదు.