అమిత్ షా చెప్పింది ఇప్పట్లో జరిగేదేనా ?

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా ఆశలు పెట్టుకున్నట్లే ఉన్నారు. మూడు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ విస్తరణపై చేసిన తీర్మానంలో షా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ఇంతవరకు ఏదోలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ తర్వాత చేసిన వ్యాఖ్యలే అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.

ఇంతకీ ఆ వ్యాఖ్యలు ఏమిటంటే ఏపీ, తమిళనాడు, కేరళలో కూడా తొందరలోనే అధికారంలోకి వచ్చేస్తారట. నిజానికి తెలంగాణాలో అధికారంలోకి వచ్చేదే అనుమానం. ఎందుకంటే వచ్చే ఎన్నికల విషయంలో తెలంగాణాలో కమలనాథులు నానా గోల చేస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో పార్టీకి అంత సీన్ లేదని అందరికీ తెలిసిందే. గెలుపు సంగతి పక్కన పెట్టేస్తే 119 నియోజకవర్గాల్లో అన్ని చోట్ల గట్టి అభ్యర్ధులను పోటీ పెట్టేంత సీన్ కూడా పార్టీకి లేదు.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మహా అయితే 40 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు గట్టి అభ్యర్ధులు దొరికితే అదే చాలా ఎక్కువ. పోటీకే అభ్యర్ధులు దొరకని పార్టీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తుందని చెబితే ఎవరు నమ్ముతారు ? సరే రాజకీయపార్టీలన్నాక ఇలాగే చెప్పాలని అనుకున్నా చెప్పుకునేదేదో కాస్త రియాలిటీకి దగ్గరలో ఉంటే బాగుంటుంది.

ఎంతో కొంత బలముందని చెప్పుకునే తెలంగాణాలోనే పార్టీ పరిస్దితి ఇలాగుంటే అసలు ఏమాత్రం బలంలేని ఏపీ, తమిళనాడు, కేరళలో తొందరలో అధికారంలోకి వచ్చేయబోతున్నట్లు అమిత్ షా చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఏపిలో అయితే 2019 ఎన్నికల్లో గానీ తర్వాత జరిగిన మూడు ఉపఎన్నికల్లో కానీ బీజేపీ అభ్యర్ధులకు ఏ నియోజకవర్గంలో కూడా కనీసం డిపాజిట్ కూడా దక్కలేదని అందరికీ తెలిసిందే. ఏపీకి నరేంద్ర మోడీ సర్కార్ అన్యాయం చేస్తున్నంత కాలం పార్టీ పరిస్థితి ఇలాగే ఉంటుందనటంలో సందేహం లేదు. ఇలాంటిది ఇక తమిళనాడు, కేరళ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.