నేపాల్ కూడా భారత్ భూమిని కబ్జా చేసిందా ?

భారత్ భూభాగాన్ని కబ్జా చేయాలని ఒకవైపు దాయాది దేశం పాకిస్తాన్, మరోవైపు డ్రాగన్ దేశం చైనా 24 గంటలు 365 రోజులూ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పై రెండు దేశాలు వివిధ సందర్భాల్లో వేలాది కిలోమీటర్లను ఆక్రమించేశాయి. పీవోకే అంటే పాక్ ఆక్యుపెయిడ్ కాశ్మీర్ రూపంలో సుమారు 2500 కిలోమీటర్ల భూభాగాన్ని పాకిస్తాన్ తన కబ్జాలో దశాబ్దాలుగా అట్టే పెట్టేసుకున్నది. పై రెండు దేశాల దురాక్రమణలు అందరికీ తెలిసిందే.

అయితే చడీ చప్పుడు లేకుండా మరో దేశం నేపాల్ కూడా ఇండియా భూభాగాన్ని ఆక్రమించేసింది. ఆక్రమించేసిన భూమి 5 హెక్డార్లే అయినా అసలు నేపాల్ కూడా భూ కబ్జాకి పాల్పడటమే విచిత్రంగా ఉంది. పాకిస్ధాన్, చైనా తో అంటే మన దేశానికి అనేక సమస్యలున్నాయి. చైనాతో జరిగిన యుద్ధం సమయంలో భారత్ ఓడిపోయింది కాబట్టి అప్పట్లో వాళ్ళ ఆధీనంలో ఉన్న భూమిని వాళ్ళే సొంతం చేసుకున్నారు.

అలాగే పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారతే గెలిచినప్పటికీ అప్పటి కారణాల వల్ల వాళ్ళని మన భూభాగం నుండి తరిమేయలేదు. పైగా వాళ్ళ ఆధీనంలోని భూమిని కేంద్ర ప్రభుత్వం విడిపించలేదు. అప్పట్లోనే పాకిస్ధాన్ సైన్యాలను తరిమేసుంటే సరిపోయేది. అలా కాదని చర్చలని, మరోటని ప్రయత్నాలు చేసేటప్పటికి పాకిస్తాన్ బిగదీసుకుని కూర్చుని మొత్తం భూమిని కబ్జా చేసేసింది. కాలక్రమంలో తన ఆధీనంలోని భూమిని చైనాకు పాకిస్తాన్ దారాదత్తం చేసింది.

సరే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అయితే నేపాల్ కు ఏమైందో అర్థం కావటం లేదు. భారత్-నేపాల్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. పైగా నేపాల్ కు ఇతర దేశాల భూభాగాలను కబ్జా చేసిన చరిత్ర లేదు. ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతంలో చంపావత్ అటవీ ప్రాంతముంది. అక్కడి భూమినే నేపాల్ ఆక్రమించినట్లు ఉత్తరాఖండ్ అటవీశాఖ గుర్తించి కేంద్రానికి లేఖ రాసింది. ఇదే విషయమై ఉత్తరాఖండ్ అటవీశాఖ మంత్రి సుబోధ్ ఉనియాల్ మాట్లాడుతూ కబ్జా నిజమే అన్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వంతో మాట్లాడుతోందని చెప్పారు.