విరాళాలు సరే మద్దతేది ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యుల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. పవన్ తల్లి పార్టీకి లక్ష రూపాయల విరాళమిచ్చారు. అలాగే మరో లక్షన్నర రూపాయలు ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాలకు అందించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకునేందుకు పవన్ జిల్లాల పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. కష్టాల్లో ఉన్నవారిని ఆర్ధికంగా ఆదుకోవటం నిజంగా మంచిపనే.

ఈ మధ్యనే పవన్ సోదరుడు నాగబాబు పిల్లలు, సోదరి పిల్లలు నలుగురు కలిసి రు. 35 లక్షల విరాళాన్ని చెక్కుల రూపంలో అందించారు. వీళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకునేందుకే ఖర్చు చేయాలని కోరారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు విరాళిస్తున్న కుటుంబ సభ్యులు రాజకీయంగా ఆదుకునేందుకు పవన్ కు ఎందుకు మద్దతివ్వడం లేదు ?

జనసేన పార్టీలో పవన్ కు మద్దతుగా కేవలం నాగుబాబు మాత్రమే యాక్టివ్ గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నాగబాబుకు చిరంజీవి సోదరుడిగానే తప్ప సొంతంగా అభిమానులు లేరు. అలాగే జనాల్లో పెద్దగా క్రేజు కూడా లేదు. నాగబాబు సినిమా కెరీర్ మొత్తం చిరంజీవి మీదే ఆధారపడుంది. అలాగే రాజకీయ జీవితం మొత్తం పవన్ పైనే ఆధారపడుందనటంలో సందేహం లేదు. మరి మెగా కాంపౌండ్ లోనే సుమారు ఆరుగురు హీరోలున్నారు.

రాజకీయాల్లోకి వచ్చి చిరంజీవి చేతులు కాల్చుకున్నారు కాబట్టి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. భవిష్యత్తులో మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేది కూడా లేదని ప్రకటించేశారు. చిరంజీవిని మినహాయిస్తే ఆయన కొడుకు రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు మరో నలుగురు హీరోలున్నారు. సినిమాల్లోకి వీళ్ళ ఎంట్రీ అంతా చిరంజీవి వేసిన ప్లాట్ ఫారం మీదే అయినా కొద్దో గొప్పో అభిమానులను సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ కు అభిమానుల ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. మరింతటి ఫాలోయింగ్ పెట్టుకున్న వాళ్ళలో ఎవరు కూడా పవన్ కు మద్దతుగా ఎందుకు నిలబడటం లేదనేది అర్ధం కావటం లేదు.