ఎవ‌రీ ద్రౌప‌ది.. ఎక్క‌డి వారు.. ఏం చేసేవారు?

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికయ్యారు. ఎన్డీఏ పక్షాలు అన్నింటితో చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం గిరిజన వర్గాల వారికి లభించడం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఒక గిరిజ‌న మ‌హిళ‌కు.. అందునా ఆదివాసీ మ‌హిళ‌కు అవ‌కాశం ద‌క్క‌డం ప్ర‌ప్ర‌థ‌మం. ఈ నేప‌థ్యంలో ద్రౌపది ముర్ము ఎవ‌రు? ఏం చేసేవారు? ఎక్క‌డ నుంచి వ‌చ్చారు? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. మ‌రి ఆమె విశేషాలు చూద్దాం..

ద్రౌప‌దీ ముర్ము విశేష ప్రతిభాశాలి. ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రిగా, గవర్నర్గా మెరుగైన సేవలు అందించారు. ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసిలో జన్మించారు. ఝార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్చరణ్ ముర్ము. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించిన ద్రౌపది ముర్ము.. అనంతరం రాజకీయాల్లో ప్రవేశించారు. వివాదాలు లేని వ్యక్తిగా గుర్తింపు పొందారు. జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్గా పనిచేశారు. ఇప్పుడు రాష్ట్రపతి రేసులో నిలిచిన తొలి గిరిజన మహిళగా ఆమె నిలిచారు.

పుట్టిన రోజు గిఫ్ట్‌!

ఒరిస్సాకు చెందిన ద్రౌపది ముర్ము వయసు 64 సంవ‌త్స‌రాలు. 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేశారు. 20 జూన్ 1958న ఒరిస్సాలోని మయూర్‌భంజ్ జిల్లా బైదాపోసి గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు. ఒరిస్సాలోని భారతీయ జనతా పార్టీ, బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో మార్చి 6, 2000 నుండి ఆగస్టు 6, 2002 వరకు వాణిజ్యం, రవాణాకు స్వతంత్ర రాష్ట్ర మంత్రిగా ఆమె పనిచేశారు.

ఆగస్టు 6, 2002 నుండి 2004 మే వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. 2004 ఎన్నిక‌ల్లో రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. వివాద‌ర‌హితురాలిగా.. భాషా నైపుణ్యురాలిగా.. లెక్చ‌ర‌ర్‌గా మంచి వ‌క్త‌గా పేరు తెచ్చుకున్న ముర్మూకు పుట్టిన రోజు గిఫ్ట్‌గా మోడీ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిత్వానికి ఎంపిక చేయ‌డం గ‌మ‌నార్హం.