గురువుల‌కు షాక్ ! నోటీసులు ఎందుకు జ‌గ‌న్ !

ఆంధ్రావ‌నిలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ఫ‌లితాలు ఆశించిన మేర లేని కార‌ణంగా గురువుల‌కు షోకాజ్ నోటీసులు వెళ్తున్నాయి. దీంతో జ‌గ‌న్ స‌ర్కారు చ‌ర్య అంతటా చ‌ర్చ‌కు తావిస్తోంది. తాజాగా సమాచారం అనుస‌రించి క‌స్తూరిబా బాలిక‌ల పాఠ‌శాల‌ల‌కు సంబంధించి ఫ‌లితాలు బాగుండ‌క‌పోవ‌డంతో సంబంధిత గురువుల‌కు స‌ర్వ‌శిక్ష అభియాన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ చ‌ర్య‌ను నిర‌సిస్తూ, స‌ర్కారును ప్ర‌శ్నిస్తూ ఉపాధ్యాయ సంఘాలు మండిప‌డుతున్నాయి.

ఇప్ప‌టికే ఎంతో ఒత్తిడిని అధిగ‌మించి పాఠాలు చెబుతున్నామ‌ని, సిబ్బంది కొర‌త వేధిస్తున్నా కూడా తాము క్ర‌మం త‌ప్ప‌క పాఠాలు చెప్పేందుకు సిల‌బ‌స్ పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని అయినా కూడా ఈ విధంగా చేయ‌డం త‌గ‌ద‌ని అంటున్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం త‌న చ‌ర్య‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని కోరుతున్నారు. త‌మ‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌లు మానుకుంటే మేలు అని లేదంటే ఉద్య‌మించ‌క త‌ప్ప‌ద‌ని వీరంతా హెచ్చ‌రిస్తున్నారు. నోటీసులకు రెండు రోజుల్లో స‌మాధానం ఇవ్వాల‌ని లేదంటే క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సంబంధిత అధికారులు స్ప‌ష్టం చేస్తూ ఉన్నారు.

వాస్త‌వానికి ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల అయిన నాటి నుంచి నేటి వ‌ర‌కూ ఏదో ఒక ర‌గ‌డ నెల‌కొంటూనే ఉంది. వీలున్నంత వ‌ర‌కూ ఎక్కువ ఫ‌లితాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు ప్ర‌య‌త్నించ‌లేద‌ని ఓ ఆరోప‌ణ వినిపిస్తోంది. ఇదే స‌మయంలో టీచ‌ర్ల వాద‌న వేరే విధంగా ఉంది. ముఖ్యంగా నాడు నేడు ప‌నుల‌లో త‌మ‌ను ఉంచి, చదువులు చెప్పే అవ‌కాశమే త‌మకు ద‌క్క‌నీయ‌కుండా చేశార‌న్న‌ది మ‌రో అభియోగం.

ఏదేమ‌యిన‌ప్ప‌టికీ పీఆర్సీ కోసం ప‌ట్టుబ‌డుతూ ఉద్య‌మాలు చేసినందుకే ప్రభుత్వం ఈ విధంగా క‌క్ష సాధింపు చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ని, తాము దేన్న‌యినా ఎదుర్కొంటామ‌ని, స‌ర్కారు బ‌డికి మ‌రింత మంచి పేరు తెచ్చేందుకు ప‌నిచేస్తామ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి కూడా ఎన్న‌డూ షోకాజ్ నోటీసులు ఇచ్చిన దాఖ‌లాలు లేవ‌ని, కానీ జ‌గ‌న్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హరించి బోధ‌న సిబ్బందిపై ఒత్తిడి పెంచుతున్నార‌ని వాపోతున్నారు. స‌రైన సమ‌యంలో స‌రైన రీతిలో ఖాళీలు భ‌ర్తీ చేసి, అధ్యాప‌కుల‌కు పాఠాలు బోధించే అవ‌కాశం ఇస్తే బాగుండేద‌ని, కానీ విద్యా సంవ‌త్స‌రం చివ‌రి వ‌ర‌కూ త‌మ‌కు బోధ‌నేతర ప‌నుల‌తోనే స‌మ‌యం స‌రిపోయింద‌ని వీరంతా ఆవేద‌న చెందుతూ, ప్ర‌భుత్వ విధానాలు అంత ఆమోద యోగ్యం గా లేవ‌ని అంటున్నారు.

నాడు నేడు బ‌డుల తీరు మారినా వాటి రూపు రేఖ‌లు మారినా ముఖ్యంగా టీచింగ్ అప్రోచ్ ను పెంచేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేద‌ని, స్టాఫ్ రిక్రూట్మెంట్ కు ప్రాధాన్యం ఇవ్వ‌కుండా త‌మ‌ను ఇబ్బందులకు గురి చేస్తున్నార‌ని ఇదే విధంగా కొన‌సాగితే స‌ర్కారు బడులు ముందున్న కాలంలో మ‌రిన్ని స‌మ‌స్య‌ల‌కు ఆన‌వాలుగా మారిపోతాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు వీరంతా !