భోరున ఏడ్చేసిన ముఖ్య‌మంత్రి

సినిమాలు చూసి క‌న్నీళ్లు పెట్టుకునే వారు ఇప్పుడు చాలా చాలా అరుదుగా క‌నిపిస్తున్నారు. ఎందుకంటే.. త‌మ జీవితాల్లోనూ సినిమాల‌ను మించిన క‌ష్టాలు వ‌స్తున్నాయి. నిత్య జీవితంలో ప్ర‌తి ఒక్క‌రి క‌ష్టాలు సినిమాల‌ను త‌ల‌పిస్తున్నాయి. దీంతో ఎంతో బాధాక‌ర‌మైన స‌న్నివేశాలు.. సెంటిమెంటుతో కూడిన స‌న్నివేశాలు ఉంటే త‌ప్ప‌.. పెద్ద‌గా ఎవ‌రికి క‌ళ్లు చెమ‌ర్చ‌డం లేదు. కానీ, క‌ర్ణాట‌క సీఎం మాత్రం ఓ సినిమా చూసి భోరున క‌న్నీరు కార్చారు. ఇదేదో ఒక్క క్ష‌ణ‌మో.. రెండు క్ష‌ణాలో కాదు.. సినిమా చూస్తున్నంత సేపు.. త‌ర్వాత కూడా ఆయ‌న క‌న్నీరు కారుస్తూనే ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ సంఘ‌ట‌న ఆస‌క్తిగా మారి వైర‌ల్ అవుతోంది.

విష‌యం ఏంటంటే..

పెంపుడు జంతువులకు, మనుషులకు ఉన్న అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేం. వాటిని తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిలా చూసుకుంటారు కొందరు. వాటికి ఏమైనా జరిగితే తట్టుకోలేరు కూడా. కొన్నిసార్లయితే కన్నీళ్లు పెట్టుకుంటారు. అలాంటి ఘటనే కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైకు ఎదురైంది. ఇటీవల ఆయన 777 చార్లీ అనే సినిమా చూశారు. పెంపుడు కుక్కతో ఒక వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు. అయితే సినిమా చూసిన సీఎం బొమ్మైకి చనిపోయిన తన పెంపుడు కుక్క గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమా చూస్తూ ఉన్నంత సేపు భావోద్వేగానికి గురయ్యారు. సినిమా హాలులోనే కన్నీళ్లు పెట్టుకున్నారు.

బొమ్మై కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోలు, వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమా చూశాక సీఎం బొమ్మై మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. “కుక్కల గురించి అనేక సినిమాలు వచ్చాయి. అయితే జంతువులతో ఉండే అనుబంధం, భావోద్వేగాన్ని ఈ సినిమాలో చాలా గొప్పగా చూపించా”రని చెప్పుకొచ్చారు. కుక్కలది షరతులు లేని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ అని అన్నారు.

బొమ్మై వ్యక్తిగతంగా జంతు ప్రేమికులు. కుక్కలంటే ఆయనకు మహా ప్రేమ. గతేడాది ఆయన పెంపుడు కుక్క చనిపోయినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజా సినిమా చూసినప్పుడు మళ్లీ తన కుక్క గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంత‌టి అధికార హోదాలో ఉన్నా సెంటిమెంటుకు ప‌డిపోని వారు ఉండ‌ర‌ని సీఎం నిరూపించారని అంటున్నారు నెటిజ‌న్లు.