కేసీఆర్ ఆత్మ ఉండ‌వ‌ల్లి అవుతారా ? ఆవిష్కృతం చేస్తారా ?

రాజ‌కీయాల్లో ఆత్మ‌లు ఆత్మ బంధువు అన్న‌వి ఉంటాయి. వైఎస్సార్ ఆత్మ కేవీపీ అని అంటుంటారు. అలానే ఇప్పుడు సాయిరెడ్డి అనే ఆడిట‌ర్, రాజ్య‌సభ స‌భ్యులు జ‌గ‌న్ కు ఆత్మ బంధువు అయ్యారు. సిస‌లు బంధువులు బాలినేని శ్రీ‌నివాస్, వైవీ సుబ్బారెడ్డి అనే వారు త‌ప్పుకున్నారు దాదాపుగా.. ! త‌ప్పించేశారు అని రాయాలి..అన్న‌ది వాద‌న. జ‌గ‌న్ అంటే గిట్ట‌ని వారు వినిపించే వాద‌న. ఇవి ఎలా ఉన్నా తాజాగా కేసీఆర్ తో ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ అనే మాజీ ఎంపీ, రాజ‌కీయ‌వేత్త భేటీ అయ్యారు. అంటే ఇప్పుడు ఏపీలో కేసీఆర్ త‌ర‌ఫున వాయిస్ వినిపించే నాయ‌కుడు ఉండ‌వ‌ల్లి అవుతారా ? అన్న మాట ఒక‌టి సందేహ రూపంలో వ్య‌క్తం అవుతోంది.

త్వ‌ర‌లో భార‌తీయ రాష్ట్ర స‌మితి క్లుప్తంగా బీఆర్ఎస్ పేరిట జాతీయ పార్టీ ఆవిర్భ‌వించ‌నున్న నేప‌థ్యంలో ఇందుకు కేసీఆర్ సార‌థ్యం వ‌హించ‌నున్న నేప‌థ్యంలో ఈ వార్త ఇప్పుడొక హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల‌లో ఎవ‌రు పార్టీ పెట్టాల‌నుకున్నా ముందుగా ఉండ‌వ‌ల్లినే సంప్ర‌దించ‌డం ఇటీవ‌ల ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఆ మ‌ధ్య ద‌ళిత, మైనార్టీ, క్రిస్టియ‌న్ వ‌ర్గాల‌తో పార్టీ పెడ‌తాన‌ని బ్ర‌ద‌ర్ అనీల్ చెప్పారు. ఆ సంద‌ర్భంలో కూడా రాజ‌మండ్రి వ‌చ్చి ఉండ‌వ‌ల్లిని క‌లిసి వెళ్లారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇదే విధంగా ఉండ‌వ‌ల్లితో ఆత్మీయ భేటీ జ‌రిపి, రెండు రాష్ట్రాల ప‌రిణామాల‌పై చ‌ర్చించార‌ని టాక్. బీఆర్ఎస్-కు సంబంధించి ఒక‌వేళ ఏపీ బాధ్య‌త‌లు కేసీఆర్ అప్ప‌గిస్తే ఉండ‌వ‌ల్లి స్వీక‌రిస్తారా? అన్న డౌట్ కూడా వ్య‌క్తం అవుతోంది పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో!

రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు ఆయ‌న పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. అంత‌కు మునుపు కూడా వైఎస్సార్ కార‌ణంగానే ఆయ‌న రెండు సార్లు ఎంపీ అయ్యారు అన్న వాద‌న కూడా వినిపిస్తోంది. క‌నుక ఆయ‌న‌కు ఇంత‌టి కీల‌క బాధ్య‌త‌లు కేసీఆర్ అప్ప‌గిస్తారా ? అన్న డౌట్ చ‌క్క‌ర్లు కొడుతోంది మీడియా స‌ర్కిళ్ల‌లో కూడా !