ఏపీ మీద మమత నమ్మకం కోల్పోయారా ?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహారం చూసిన తర్వాత ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోతోంది. వచ్చే నెలలో జరగబోతున్న రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాలని మమత అనుకున్నారు. ఇందుకోసం ఈనెల 15వ తేదీన ఢిల్లీలోని కాన్సిస్టిట్యూషన్ క్లబ్ లో ప్రత్యేకించి మమత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సోనియా గాంధీతో సహా 22 పార్టీల అధినేతలకు మమత ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు.

సోనియా గాంధీ, శరద్ పవార్ కేసీయార్ లాంటి కొందరికి ప్రత్యేకించి ఫోన్లో సమావేశానికి ఆహ్వానించారు. ఇంతమందికి ఆహ్వానాలు పంపించి, కొందరికి ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడిన మమత ఏపీని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డికి కానీ చంద్రబాబునాయుడుకు కానీ కనీసం ఆహ్వానాలు అందలేదు. అంటే ముఖ్యమంత్రికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పైన మమతకు నమ్మకం ఉన్నట్లు లేదు.

మధ్యమధ్యలో పొరపొచ్చాలున్నా జగన్ అయినా చంద్రబాబు అయినా గడచిన ఎనిమిదేళ్ళుగా నరేంద్ర మోడీ లోనే ఉంటున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, ఇపుడు జగన్ అధికారంలో ఉన్నా ఇదే పద్దతిలో వెళుతున్నారు. ఇద్దరిలో ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా తమ వైఖరిని మార్చుకోవడం లేదు. దాంతో వీళ్ళిద్దరితో మాట్లాడి, చర్చించినా ఉపయోగం ఉండదని మమతకు బాగా అర్ధమైపోయినట్లుంది. అంటే వీళ్ళిద్దరినీ మమత ఎన్డీయేలో భాగంగానే చూస్తున్నట్లుంది. అందుకనే కీలకమైన సమావేశానికి ఈ ఇద్దరినీ దూరంగా పెట్టేశారు.

ఇపుడే కాదు గతంలో కూడా నరేంద్రమోడిని వ్యతిరేకించే పార్టీల అధినేతలతో మమత కొన్ని సమావేశాలు నిర్వహించారు. అప్పట్లో కూడా జగన్, చంద్రబాబును పిలవలేదు. వీళ్ళద్దరిని కనీసం ఫోన్లో కూడా ఎవరు సంప్రదించటం లేదు. నిజంగా ఏపీలోని రాజకీయ పార్టీలకు ఒక విధంగా అవమానమనే చెప్పాలి. కానీ ఎవరు ఏమీ చేయగలిగిందేమీ లేదు ఎందుకంటే జగన్ అయినా చంద్రబాబు అయినా వాళ్ళ అవసరాల కోసం కేంద్రంపై ఆధారపడుతున్నారు. దీన్ని మోడి కూడా బాగా అలుసుగా తీసుకుని రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్నారు. రాష్ట్రానికి మోడి ఇంత అన్యాయం చేస్తున్న గొంతెత్తటం లేదు కాబట్టి వీళ్ళతో మాట్లాడి ఉపయోగంలేదని చివరకు అందరు వదిలేస్తున్నారు.