రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ వాటా ఎంతో తెలుసా ?

రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు ఓట్లేస్తారు. వీళ్లతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఎంఎల్ఏలు కూడా ఓటింగ్ లో పాల్గొంటారు. జూలై 18వ తేదీన జరగబోయే పోలింగుకు మూడు రోజుల తర్వాత అంటే 21వ తేదీన ఫలితాలు తెలుస్తాయి. నిజానికి నరేంద్ర మోడీ అనుకున్నట్లు వ్యవహారాలు సాగితే ఎన్డీయే అభ్యర్ధే రాష్ట్రపతి అవటం ఖాయం. అప్పుడు పోలింగ్, ఓట్ల లెక్కింపు అవసరం పడదు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే మొత్తం ఓట్ల విలువ 10,86,431. ఇందులో ఎంపీల ఓట్ల విలువ 5,43,200 అయితే ఎంఎల్ఏల ఓట్ల విలువ 5,43,231. ఎంఎల్ఏల ఓట్ల విలువ ఆయా రాష్ట్రాల్లోని అసెంబ్లీ సభ్యుల సంఖ్య ఆధారంగా మారుతుంది. ఈ పద్దతిలో ఏపీ విషయం తీసుకుంటే 25 మంది లోక్ సభ+11 మంది రాజ్యసభ ఎంపీల విలువ 25,448. అలాగే 175 మంది ఎంఎల్ఏల ఓట్ల విలువ 27,825. అంటే మొత్తం ఓట్ల విలువ 53,313 అయితే ఇందులో వైసీపీ ఓట్ల విలువ 45,957.

ఇక్కడే కేంద్రంలో వైసీపీకి బాగా విలువ పెరిగిపోయింది. పార్లమెంట్ లో ఎక్కువ ఎంపీలున్న పార్టీల్లో వైసీపీ 5వ స్ధానంలో ఉంది. ఈ ఓట్లకోసం+రాజ్యసభలో అవసరాల కోసమే జగన్ తో మోడి సఖ్యతగా ఉంటున్నది. పైకి చూస్తే ఎన్డీయే బలంగా ఉందని అనిపిస్తున్నా ఓట్ల పరంగా చూస్తే తక్కువనే చెప్పాలి. ఎన్డీయే బలాన్ని భేరీజు వేసినపుడు యూపీఏ కన్నా ఎక్కువే. కానీ ఎన్డీయే బలం, నాన్ ఎన్డీయే పార్టీల బలాన్ని చూసినపుడు నాన్ ఎన్డీయే పార్టీల బలమే ఎక్కువ. అంటే నాన్ ఎన్డీయే పార్టీల మద్దతు లేనిదే మోడీ ప్రతిపాదించే రాష్ట్రపతి అభ్యర్ధి గెలవలేరు.

ఇక్కడ నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీలంటే ఒడిస్సాలో బిజూ జనతాదళ్, ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ అనే ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ పార్టీల్లో ఏ ఒక్క పార్టీ ఎన్డీయేకి మద్దతిచ్చినా గెలుపు ఖాయమే. అయితే టీఆర్ఎస్ అధినేత కేసీయార్ వైఖరి ఎప్పుడెలాగుంటుందో ఎవరు చెప్పలేరు. బిజూ జనతాదళ్ అధినేత, ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ మనసులోని మాట ఏమిటో తెలీదు. మిగిలింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మొదటి నుండి జగన్ కేంద్రానికి మద్దతుగానే ఉంటున్నారు. కాబట్టి ఎన్డీయే అభ్యర్ధి గెలుపు లాంఛనమనే అనుకోవాలా ?