రాజధాని నిర్మాణం.. ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసిందా?

ఏపీ రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలంటే కనీసం ఐదేళ్ళు పడుతుందని ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్లో చెప్పింది. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయటానికి, రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను అభివృద్ధి చేయటానికి, రాజధాని నగరం నిర్మించటానికి ప్రభుత్వానికి హైకోర్టు ఆరు మాసాలు మాత్రమే సమయమిచ్చింది. హైకోర్టు తీర్పు ఏ మాత్రం ఆచరణ సాధ్యం కాదని ప్రభుత్వం గతంలోనే ఒక అఫిడవిట్ దాఖలు చేసింది.

దానికి అనుబంధంగా తాజాగా దాఖలుచేసిన మరో అఫిడవిట్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు కేటాయించాలంటే గడువన్నా పొడిగించాలి లేదా ఐదేళ్ళ సమయమైనా ఇవ్వాలని స్పష్టంగా చెప్పేసింది. అలాగే కోర్టు అడిగినట్లుగా ఏప్రిల్ 1 నుండి జూన్ 3వ తేదీ వరకు భూసమీకరణ పథకం, ప్రాథమిక వసతులతో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించింది. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన 63,452 ప్లాట్లను ఇవ్వాలని చెప్పింది.

ఇందులో 41,885 ప్లాట్లను రైతుల పేరుతో రిజిస్టర్ చేసింది. ఇంకా 21,567 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పెండింగ్ లో ఉన్నట్లు చెప్పింది. రిజిస్ట్రేషన్ కోసం రైతులకు నోటీసులు ఇస్తున్నా పెద్దగా స్పందించడం లేదని కూడా చెప్పింది. భూసమీకరణ వివాదం కారణంగా 3,289 ప్లాట్లను కేటాయించలేదని కూడా అఫిడవిట్ లో తెలిపింది. పనులు తొందరగా పూర్తి చేయడానికి ఏపీ సీఆర్డీయే ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్న విషయాన్ని అఫిడవిట్లో చెప్పింది. అవసరమైన నిధుల సేకరణకు కూడా బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించినట్లు కూడా తెలిపింది.

ప్రభుత్వం అడుగుతున్నట్లు భారీ ఎత్తున నిధులు సమకూరాలంటే ఒక్క బ్యాంకు వల్ల సాధ్యం కాదని అందుకనే బ్యాంకుల కన్సార్షియం గా ఏర్పడాల్సిందే అని బ్యాంకర్లు చెప్పారట. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం అప్పులు కావాలంటే ఆదాయ మార్గాలను చూపాలట. అలాగే అమరావతి టౌన్ షిప్, నవులూరులోని 331 ఖాళీ ప్లాట్లను వేలం వేయటం ద్వారా రు. 330 కోట్లు వస్తుందని అంచనా వేసినట్లు ప్రభుత్వం అఫిడవిట్లో స్పష్టం చేసింది. నిర్మాణంలో ఉన్న కోర్టు భవనాలు, రహదారులు, జరుగుతున్న ఎంఎల్ఏ, ఎంఎల్సీ, ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ భవవనాల నిర్మాణాలను కూడా వివరించింది. సో ప్రభుత్వం తాను చెప్పదలచుకున్నది చెప్పేసింది కాబట్టి హైకోర్టు ఏమంటుందో చూడాలి.