కాంగ్రెస్ కు గట్టిదెబ్బ తప్పదా?

మరో ఏడాదిలోపు ఎన్నికలు జరగబోతున్న గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టిదెబ్బ తగిలింది. పటీదార్ సామాజకవర్గంలో గట్టి పట్టున్న హార్దిక్ పటేల్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేయటం ఒకనష్టమైతే పటేల్ తొందరలోనే బీజేపీలో చేరుతుండటం మోరో నష్టమనే చెప్పాలి. రిజర్వేషన్లకు ఒకపుడు పటీదార్లు చేసిన ఉద్యమం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది.

ఆ రిజర్వేషన్ల ఉద్యమంలో బాగా పాపులరైంది హార్దిక్ పటేలే. ఆ ఉద్యమంతోనే పటేల్ అన్నీపార్టీల దృష్టిని ఆకర్షించారు. యువనేతను చేర్చుకునేందుకు చాలాపార్టీలు ఉత్సాహం చూపించినా ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే చేరిన దగ్గరనుండి పటేల్ ఏదో ఒక అసంతృప్తితోనే ఉన్నాడు. తనకు పార్టీ నాయకత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వటంలేదని, తనను పట్టించుకోవటంలేదని చాలాసార్లు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తంచేశారు.

హార్దిక్ పటేల్ కు కావాల్సిందేమిటనే విషయాన్ని కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యేకించి రాహుల్, ప్రియాంక గాంధీలు పట్టించుకున్నట్లులేదు. దాంతో పటేల్ తొందరలోనే కాంగ్రెస్ కు రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వస్తున్నా ఎవరు పట్టించుకోలేదు. దాన్ని అవమానంగా భావించిన పటేల్ ఇపుడు రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నారు. నిజానికి గుజరాత్ లో కాంగ్రెస్ అధికారం కోల్పోయి సుమారు 20 సంవత్సరాలవుతోంది. అంటే పార్టీ ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నదనే చెప్పాలి.

ఇలాంటి సమయంలో పటీదార్ల సామాజికవర్గంలో పట్టున్న యువనేతను నిర్లక్ష్యంతో వదులుకోవటం కాంగ్రెస్ పార్టీ తప్పనే చెప్పాలి. ఒకవైపు పటేల్ ను వదులుకుంటునే మరోవైపు పటీదార్లలో గట్టిపట్టున్న రాజేష్ పటేల్ ను పార్టీలోకి రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఉన్నవాళ్ళను వదులుకోవటం ఎందుకు ? బయటవాళ్ళను పార్టీలో చేర్చుకునేందుకు అవస్తలు పడటం ఎందుకో అర్ధం కావటంలేదు. హార్దిక్ పటేల్ ను పిలిపించి ఆయన సమస్యేంటో కనుక్కునుంటే బాగుండేది. పార్టీలో ఇపుడున్న సీనియర్లతో కాంగ్రెస్ అధికారంలోకి రావటం జరిగేపనికాదని అర్ధమైపోయింది. యువతకు అత్యంత ప్రాధాన్యతని ఒకవైపు తీర్మానాలు చేసిన పార్టీ మరోవైపు యువనేతలు వెళ్ళిపోతున్నా పట్టించుకోపోవటమే విచిత్రంగా ఉంది.