కాంగ్రెస్ చ‌చ్చిన పాము.. నా ఇమేజ్ పోయింది: PK

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్  గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ వల్ల తన ట్రాక్ రికార్డు పాడయిందని, ఆ పార్టీతో పనిచేసేది లేదని అన్నారు. బీహార్‌లోని వైశాలిలో ఉన్న దివంగత ఆర్జేడీ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ నివాసం నుంచి తన జన్ సూరజ్ యాత్రను ప్రశాంత్ కిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  వివిధ పార్టీలతో కలిసి తాను పనిచేసిన వైనాన్ని, ఆయా పార్టీలు గెలుపొందిన విషయాన్ని ప్రస్తావించారు. 2017 యూపీ ఎన్నికలను కూడా ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ పార్టీ వల్లే తాను (వ్యూహకర్తగా) ఓడిపోయానన్నారు. కాంగ్రెస్‌ను ఒక చ‌చ్చినపాముతో పోల్చారు.

దీంతో తన ట్రాక్ రికార్డు దెబ్బతిందని, వారితో పనిచేసేది లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ‘మహకూటమితో 2015లో బీహార్‌లో గెలిచాం. 2017లో పంజాబ్‌లో, 2019లో జగన్ మోహన్‌రెడ్డితో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో గెలిచాం. కేజ్రీవాల్‌తో 2020లో ఢిల్లీలో, 2021లో తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో గెలిచాం. కానీ  2017లో కాంగ్రెస్‌తో కలిసి యూపీలో ఓడిపాయాం’ అని  ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఆ కారణంగానే కాంగ్రెస్‌తో కలిసి పనిచేయరాదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

ఆ పార్టీ అంటే తనకు గౌరవం ఉందని, అయితే ప్రస్తుత పరిస్థితిలో ఆ పార్టీ తనంత తానుగా మెరుగయ్యే పరిస్థితి లేదని అన్నారు. అది (కాంగ్రెస్) మునుగుతూ తమను కూడా ముంచుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  “పదేళ్లలో 11 ఎన్నికల్లో నేను పాల్గొంటే ఒక్కటే.. అది కూడా కాంగ్రెస్తో కలిసినప్పుడే ఓడిపోయా. నా ట్రాక్ రికార్డును వారు దెబ్బతీశారు.“ అని ఫైర్ అయ్యారు.

వాస్త‌వానికి  గతంలో కాంగ్రెస్లో ప్రశాంత్ కిశోర్ చేరతారని పలుమార్లు ఊహాగానాలు వచ్చాయి. ఓసారి సోనియా గాంధీతోనూ భేటీ అయ్యారు. పార్టీలో చేపట్టాల్సిన మార్పుల గురించి పలు సూచనలు చేశారు. అయితే, కొన్ని కారణాల వల్ల పార్టీలో చేరలేదు పీకే. అనంతరం బిహార్ రాజకీయాల్లో చక్రం తిప్పాలని నిర్ణయించుకున్నారు. ఆ రాష్ట్రానికి చెందిన 17- 18 వేల మంది ప్రముఖుల్ని కలిసి మాట్లాడనున్నట్లు గతంలో వివరించారు పీకే. అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని పాదయాత్ర ప్రకటించారు. ఇప్పుడు అదే కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.