కేంద్ర మంత్రికి ‘మహానటి’ డైరెక్టర్ కౌంటర్

‘మహానటి’ సినిమాతో గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకుని, ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌తో వందల కోట్ల బడ్జెట్లో ‘ప్రాజెక్ట్ కే’ లాంటి భారీ చిత్రం చేసే అవకావం దక్కించుకున్నాడు నాగ్ అశ్విన్. ఐతే దర్శకుడిగా ఒకేసారి చాలా మెట్లు ఎక్కేసి తిరుగులేని స్థాయికి చేరుకున్నప్పటికీ.. సోషల్ మీడియాలో ఒక సామాన్యుడిలాగే కనిపిస్తుంటాడు నాగ్ అశ్విన్. ఒక మామూలు నెటిజన్ ఎవరో ఏదైనా ప్రశ్న అడిగినా బదులిస్తాడు.

అలాగే చాలామంది సెలబ్రెటీల్లాగా సోషల్ ఇష్యూస్ విషయంలో మనకెందుకు అనుకోకుండా స్పందిస్తుంటాడు. తన ‘ప్రాజెక్ట్ కే’ సినిమా కోసం స్పెషల్ వెహికల్స్ కావాలని మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రాకు ట్విట్టర్ వేదికగా విన్నవించి.. ఆయన్నుంచి ఆహ్వానం అందుకుని, తన కంపెనీకి వెళ్లి రావడం తెలిసిందే. ఇప్పుడు నాగ్ అశ్విన్.. ఒక కేంద్ర మంత్రికి ట్విట్టర్ వేదికగా డైరెక్ట్ కౌంటర్ వేసేశాడు. అలాగని అదేమీ తీవ్ర విమర్శ ఏమీ కాదు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమలకు చేరుకోవాలంటే అందరూ తిరుపతిలోనే దిగాలి. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో రోజూ వేలమంది ఇక్కడికి వస్తుంటారు. ఐతే ఎంతో బిజీగా ఉండే తిరుపతి రైల్వే స్టేషన్ చాలా ఏళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఆ రైల్వే స్టేషన్‌ను అధునాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. కొత్తగా రూపుదిద్దుకోబోతున్న తిరుపతి రైల్వే స్టేషన్ నమూనాలను ట్విట్టర్లో పంచుకున్నారు.

తిరుపతిలో ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ రూపుదిద్దుకోబోతోందని ఘనంగా ప్రకటించారు. ఐతే ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో రైల్వే స్టేషన్ అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా కాకుండా ఏదో విదేశీ స్టేషన్‌ను కాపీ కొట్టినట్లుగా ఉందని, బ్యాడ్ ఐపీ పార్కును తలపిస్తోందని నాగ్ అశ్విన్ పేర్కొన్నాడు. ఈ డిజైన్ ఎవ్వరికీ నచ్చడం లేదని, కావాలంటే కామెంట్లు చూస్తే అర్థమవుతుందని నాగ్ అశ్విన్ పేర్కొన్నాడు. భారతీయ సంస్కృతిని సరిగ్గా అర్థం చేసుకునే వారికి బాధ్యత అప్పగించి డిజైన్ మార్చాలని నాగ్ అశ్విన్ విన్నవించాడు. నెటిజన్లు చాలామంది నాగ్ అశ్విన్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలవడం విశేషం.