రాజకీయ మోక్షం పొందిన రఘువీరా

Raghuveera Reddy

నీలకంఠాపురం రఘువీరారెడ్డి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. సమైక్య రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో మంత్రిగా ఒక వెలుగు వెలిగారు. 2009లో అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే  వైఎస్ చనిపోయినా రఘువీరా మాత్రం ఐదేళ్ళు మంత్రిగానే ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గరా పనిచేశారు. అంటే ఏకధాటిగా పదేళ్ళపాటు మంత్రిగా పనిచేశారు. ఇపుడిదంతా ఎందుకంటే కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నారు.

అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని నీలకంఠాపురం గ్రామంలోని తన పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటు హ్యాపీగా గడిపేస్తున్నారు. తన పొలంలో వేసిన రాగులు కోతకు రావటంతో గడచిన మూడురోజులుగా పొలం పనుల్లో చాలా బిజీగా ఉంటున్నారు. రైతుకూలీలతో కలిసి కోతల్లో బిజీగా ఉన్నారట. తమ ఊరిలోనే ఆ మధ్య పెద్ద గుడి కూడా కట్టించారు. ఒకవైపు ఆధ్యాత్మికత మరవైపు పొలం పనుల్లో మునిగిపోయిన కారణంగా రాజకీయాలకు దూరమైపోయినట్లే అని అనుకుంటున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే కాంగ్రెస్ భవిష్యత్తు మీద స్పష్టమైన అవగాహన వచ్చేసినట్లుంది. అందుకనే అధ్యక్షుడిగా తప్పుకోగానే రాజకీయాలకు దూరమైపోయారు. 2019 ఎన్నికలకు ముందు రఘువీరా వైసీపీలో చేరుతారని కాదు కాదు టీడీపీలో చేరబోతున్నట్లు అనేక ప్రచారాలు జరిగాయి. అయితే ఎందులోను చేరకుండా ఆధ్యాత్మికతతో పాటు  వ్యవసాయంలో మునిగిపోయారు. రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించినందుకు కాంగ్రెస్ కు జరగాల్సిన శాస్తే జరుగుతోంది.

తాజా రాజకీయాలను చూసిన తర్వాత ఏ పార్టీలో కూడా ఇమడలేమని, అలాగే కాంగ్రెస్ కు ఇపుడిప్పుడే మంచి కాలం లేదని అనుకున్నారేమో. ఎన్నిపార్టీల నేతలు వెళ్ళి కలిసినా రాజకీయాల్లోకి మాత్రం రావడం లేదు. మరి పూర్తిగా రాజకీయాలకు దూరమైపోయారా లేకపోతే కాంగ్రెస్ కు మంచిరోజులు వస్తాయని అనిపించినపుడు మళ్ళీ రంగప్రవేశం చేస్తారా అనేది మాత్రం సస్పెన్సే. ఏదేమైనా మొదటి నుండి బాగా టచ్ లో ఉంటు, అనుభవమున్న వ్యవసాయరంగంలోనే ఇపుడు ఈ మాజీ మంత్రి హ్యాపీగా ఉన్నారనే అనుకోవాలి.