క‌శ్మీర్ వేర్పాటు వాద నేత‌కు 112 ఏళ్ల జైలు శిక్ష‌

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జమ్ము కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ కు శిక్ష ఖరారయ్యింది. ఈ మేరకు రెండు కేసుల్లో యావజ్జీవ శిక్ష విధిస్తూ ఢిల్లీ పటియాల కోర్టు తీర్పును వెలువరించింది. మొత్తం ఏడు ఆరోపణలపై శిక్షలు విధించింది.  ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కోర్టు దోషిగా తేల్చింది. ‘ఉపా’ చట్టం కింద 7 ఆరోపణలపై పటియాలా హౌస్‌ ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. రెండు కేసుల్లో యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది. మొత్తంగా అన్ని కేసుల్లో కలిపి 112.5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10,75,000 జరిమానా విధించింది.

విచార‌ణ సంద‌ర్భంగా యాసిన్ మాలిక్కు ఉరిశిక్ష విధించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)  పటియాల కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఉగ్ర నిధులకు సంబంధించి యాసిన్‌ మాలిక్‌ దోషిగా తేలిన నేపథ్యంలో ఈ మేరకు మరణ శిక్ష విధించాలని కోరింది. అయితే.. శిక్ష విషయంలో మాలిక్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. “తాను ఏమీ అడగను. అంతిమ నిర్ణయం న్యాయస్థానానిదే. నేను ఏడుగురు ప్రధాన మంత్రులతో పనిచేశాను. గత 28 ఏళ్లలో తాను హింసకు, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాలిక్ చెప్పాడు. ఉరిశిక్ష వేసినా సమ్మతమే” అని యాసిన్ తరఫున కోర్టుకు నివేదించారు న్యాయవాది.

యాసిన్‌ మాలిక్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో హైఅలెర్ట్‌ ప్రకటించారు. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌ ప్రాంతంలో బంద్‌ వాతావరణం నెలకొంది. ఓల్డ్ సిటీలో ప్రజారవాణా సైతం నామమాత్రంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సంచ‌ల‌న శిక్షలు ఇవే..

ఐపీసీ సెక్షన్ 120బి కింద 10 సంవత్సరాల జైలు శిక్ష, 10వేలు జరిమానా,
సెక్షన్ 121ఎ కింద 10 సంవత్సరాల జైలు శిక్ష, 10వేల జరిమానా
ఉపా చట్టం సెక్షన్‌ 13 కింద 5 సంవత్సరాల జైలు శిక్ష
ఉపా చట్టం సెక్షన్‌ 15 కింద 10 సంవత్సరాల జైలు శిక్ష
ఉపా చట్టం సెక్షన్‌ 17 కింద జీవిత ఖైదు, 10 లక్షల జరిమానా
ఐపీసీ సెక్షన్‌ 121 కింద రుజువైన నేరానికి జీవిత ఖైదు
ఉపా చట్టం సెక్షన్‌ 17 కింద 10 సంవత్సరాల జైలు శిక్ష, 10వేలు జరిమానా
ఉపా చట్టం సెక్షన్‌ 20 కింద 10 సంవత్సరాల జైలు శిక్ష, 10వేలు జరిమానా
ఉపా చట్టం సెక్షన్‌ 38, 39 కింద 5 సంవత్సరాల జైలు శిక్ష, 5వేలు జరిమానా
అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టు  స్పష్టం చేసింది.