కోన‌సీమ ఘ‌ట‌న‌పై స‌న్నాయి నొక్కులు

ప‌చ్చ‌టి కోన‌సీమ‌లో రేగిన జిల్లా పేరుపై అసంతృప్తి జ్లాల‌లో త‌మ పాత్ర కించిత్తు కూడా లేద‌ని.. స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి సన్నాయి నొక్కులు నొక్కారు. పాడిందే పాట‌గా.. పార్టీ నేత‌లు .. వ‌ల్లెవేసిన కామెంట్లనే ఆయ‌న కూడా ర‌న్నింగ్ కామెంట్రీగా వినిపించారు. అమలాపురంలో మంగళవారం జరిగిన దాడులు.. కుట్రపూరిత దాడులని  అనుమానం వ్యక్తం చేశారు.  మీడియాతో మాట్లాడుతూ విపక్ష నేతలవి దుర్మార్గపు రాజకీయ ఆరోపణలని తప్పికొట్టారు. కోనసీమ అల్లర్లకు వైసీపీనే కారణం అంటున్నారని, వైసీపీ వాళ్లే అయితే.. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడులు జరిగేవా? అని ప్రశ్నించారు.

టీడీపీ, పవన్, బీజేపీ ఒకే ఆరోపణలు చేస్తున్నారని, పార్టీల స్పందన చూస్తుంటే.. అందరూ ప్లాన్ ప్రకారమే చేశారనిపిస్తోందన్నారు. టీడీపీ స్క్రిప్టునే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చదివారని, ఆయనకు కనీస అవగాహన లేకుండా మాట్లాడారని ఎద్దేవాచేశారు. అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ, జనసేన కోరాయని, ప్రజల  నుంచి అభ్యర్థనలు వచ్చాయని తెలిపారు. పేరుపై అభ్యంతరాల నమోదుకు అన్ని జిల్లాలకు గడువు ఇచ్చామని సజ్జల గుర్తుచేశారు. అల్లర్ల కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అమలాపురం అల్లర్ల కేసులో అనుమానితుడు అన్యం సాయి మిగతా వాళ్లతోనూ ఫొటోలు దిగాడని, అన్యం సాయి జనసేన కార్యకర్తేనని సజ్జల తెలిపారు. అతను జనసేన నేతలతో ఉన్న ఫొటోలు ఉన్నాయని, అన్యం సాయి మిగతా వాళ్లతోనూ ఫొటోలు దిగాడని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.  బస్సులు తగలబెట్టడంతో పాటు మంత్రి విశ్వరూప్, ఎమ్యెల్యే సతీష్ ఇళ్లపై దాడి చేశారు అని అన్నారు. తమపై తాము దాడులు చేసుకుంటామా? దేనికైనా హద్దులు వుంటాయి అని మండి పడ్డారు. తనపై కూడా ఆరోపణలు చేస్తున్నారన్నారు.

తమ కార్యకర్తలు నిగ్రహంతో సమన్వయంతో వ్యవహరించారు అని స‌జ్జ‌ల స‌ర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. నిబంధనల ప్రకారమే అభ్యంతరాలకు 30 రోజుల గడువు ఇస్తారు అని, పవన్ తెలుసుకొని మాట్లాడితే బాగుండేదన్నారు. నిన్న జరిగిన సంఘటనపై చంద్రబాబు, లోకేష్ స్టాండ్ ఏమిటి?…అని ప్రశ్నించారు. అంబేద్కర్ పేరు పెట్టి దళితులను తాము దగ్గరకు తీసుకోవాలను కుంటున్నామా ?….అని అన్నారు. టిడిపి హయాంలో జరిగిన అత్యాచారాల జాబితాలను పవన్ కు ఎన్ని  కావాలంటే అన్ని పంపిస్తామ‌ని పేర్కొన్నారు. కులాలను, మతాన్ని వాడుకొని సీఎం జగన్ అధికారంలోకి రాలేదన్నారు. సొంతపార్టీకి, సొంత కులానికి ప్రాముఖ్యత ఇచ్చే చంద్రబాబు పద్దతిని జగన్ అమలు చేయలేదన్నారు.