మోడీ టూర్… కేసీఆర్ మూడోసారి డుమ్మా!

తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం బెంగళూరుకు వెళ్లనున్నారు. మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రధాని మోడీ పర్యటనకు దూరంగా ఉండనున్నారు. గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరి వెళ్తారు. దేవెగౌడ నివాసంలో లంచ్ సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనురిస్తున్న విధానం సహా తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై  చర్చిస్తారు. దేశంలో ప్రబల మార్పు రావాల్సిన అవసరం ఉందంటున్న కేసీఆర్… అందుకు సంబంధించిన అంశాలపై వారితో చర్చిస్తారు. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, ప్రాంతీయ పార్టీల పాత్ర, తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు.

త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బెంగళూరులో అభిమానులు ఇప్పటికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటు ముఖ్యమంత్రి భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. కేసీఆర్ రేపు సాయంత్రం తిరిగి హైదరాబాద్ రానున్నారు.

మోడీకి… మూడోసారి డుమ్మా!

ముఖ్యమంత్రి కేసీఆర్‌… మరోసారి ప్రధాని మోడీ పర్యటనకు దూరంగా ఉండనున్నారు. గురువారం మోడీ హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)లో జరిగే సమావేశానికి హాజరవుతున్నారు. రేపు సీఎం కేసీఆర్‌ బెంగళూరులో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్‌ పాల్గొనకపోవడం ఇది మూడోసారి. 2020 నవంబరు 28న ప్రధాని హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ను సందర్శించారు. ఆరోజు సీఎం కేసీఆర్‌ ప్రధాని పర్యటనకు రావాల్సిన అవసరం లేదని పీఎం కార్యాలయం సమాచారం ఇవ్వడంతో ఆయన ప్రధానిని కలవలేదు. తాను హాజరు కావాలనుకున్నా వద్దనడంతో వెళ్లలేదని సీఎం దీనిపై అప్పట్లో వివరణ ఇచ్చారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ప్రధాని హైదరాబాద్‌కు వచ్చారని అప్పట్లో టీఆర్ ఎస్ పార్టీ విమర్శించగా.. కేసీఆర్‌ వైఖరిపై బీజేపీ ధ్వజమెత్తింది. గత ఫిబ్రవరి 5న ప్రధాని హైదరాబాద్‌కు వచ్చారు. ముచ్చింతల్‌లో సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాష్కరణ, ఇక్రిశాట్‌లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీటికి సీఎం కేసీఆర్‌ దూరంగా ఉన్నారు. జ్వరం కారణంగా వాటిలో పాల్గొనలేదని కేసీఆర్‌ తెలిపారు. దీనిపైనా రెండు పార్టీల‌ మధ్య మాటల యుద్ధం నడచింది. తాజాగా ఐఎస్‌బీ సమావేశం గత వారం ఖరారయింది. ఇదే సమయంలో సీఎం ప్రజల ఎజెండాతో జాతీయ ప్రత్యామ్నాయ శక్తి రూపకల్పన కోసం వివిధ రాష్ట్రాల  సందర్శనకు బయల్దేరారు. ఈ క్రమంలో ప్రధాని, సీఎంలు ఈ పర్యటనలోనూ కలిసే అవకాశం లేకపోయింది.