ప‌ద‌వి కోసం.. కాంగ్రెస్‌ను వ‌దిలేసిన క‌పిల్

రాజ‌కీయాల్లో నాయ‌కులు క‌క్కుర్తి ప‌డడం తెలుసుకానీ.. దాదాపు 70 ఏళ్లు పైబ‌డి.. ఇప్ప‌టికే కేంద్ర మంత్రి.. ఇత‌ర ప‌దవులు కూడా ఒక‌టికి రెండు సార్లు అనుభవించేసిన నాయ‌కులు.. కూడా క‌క్కుర్తిప‌డ‌డ‌మే చిత్రంగా ఉంది. కేవ‌లం రాజ్య‌స‌భ సీటు కోసం.. సుదీర్ఘ కాలం రాజ‌కీయంగా ఆయ‌న‌కు అండ‌గా నిలిచిన కాంగ్రెస్‌ను వ‌దిలి పెట్టేశారు క‌పిల్ సిబ‌ల్.. దీంతో కాంగ్రెస్కు మరో సీనియర్ నేత షాక్ ఇచ్చిన‌ట్టు అయింది.

మూడు ద‌శాబ్దాలకు పైగా కాంగ్రెస్‌ పార్టీలో కీలకంగా ఉన్న నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ రాజీనామా చేశారు. బుధవారం సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సమక్షంలో లఖ్నవూలో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. మే 16నే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు నామినేషన్ అనంతరం సిబల్ వెల్లడించారు. తాను స్వతంత్ర అభ్యర్థిగానే నామినేషన్ దాఖలు చేశానని, ఎస్పీ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ఎప్పటినుంచో రాజ్యసభలో స్వతంత్ర గొంతుక కావాలనుకుంటున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీకి కొద్దికాలంగా వరుస షాక్లు తగులుతున్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. రాజస్థాన్లో చింతన్ శిబిర్ కార్యక్రమం నుంచి ఇప్పటివరకు ముగ్గురు సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. తొలుత పంజాబ్ సీనియర్ నేత సునీల్ జాఖర్ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. ఆ తర్వాత గుజరాత్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు హార్దిక్ పటేల్ కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు. ఆయన ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదు. ఇప్పుడు కపిల్ సిబల్ హస్తం పార్టీని వీడారు.

కపిల్ సిబల్ కాంగ్రెస్ అసమ్మతి జి‌23 నేతల్లో ఒకరిగా ఉన్నారు. కొంత కాలంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఎస్పీ నేత ఆజంఖాన్ బెయిల్ కోసం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. దీంతో రెండేళ్ల తరువాత మధ్యంతర బెయిల్ పై ఆజం ఖాన్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే.. క‌పిల్ వెళ్లిపోవ‌డంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. పార్టీ ఇప్పుడు వృద్ధ నేత‌ల‌ను కోరుకోవ‌డం లేద‌ని.. యువ‌త‌కు, యువ ర‌క్తానికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని భావిస్తోంద‌ని అగ్ర నేత రాహుల్ వ్యాఖ్యానించారు.