బహిష్కరణ వేటు పడకుండా వ్యూహం

తనపై పడుతుందని అనుకుంటున్న బహిష్కరణ వేటు నుంచి తప్పించుకునేందుకు వైఎస్ కొండారెడ్డి రివర్స్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పులివెందులలోని చక్రాయపల్లె మండలానికి కొండారెడ్డి వైసీపీ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి స్వయంగా కజిన్ బ్రదర్ అయిన కారణంగా ఈయనకు బాగా ప్రాధాన్యత వచ్చేసింది.

సీఎంతో ఉన్న బంధుత్వాన్ని, ముఖ్యమంత్రి కుటుంబంతో ఉన్న సన్నిహితాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని రెచ్చిపోతున్నారు. చాగలమర్రి-రాయచోటి నేషనల్ హైవే రోడ్డు వేస్తున్న కాంట్రాక్టు కంపెనీ యాజమాన్యాన్ని కొండారెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈయన వేధింపులను తట్టుకోలేక సదరు యజమాని పోలీసులను ఆశ్రయించారు. దాంతో విచారణ జరిపిన పోలీసులు కొండారెడ్డి మీద కేసునమోదు చేసి కోర్టు ద్వారా రిమాండుకు కూడా పంపారు.

బెయిల్ మీద బయటకు వచ్చిన ఈయన్ను ఏకంగా జిల్లా నుండే బహిష్కరించాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపారు. ఈ నేపధ్యంలోనే తనపైన బహిష్కరణ వేటు ఖాయమని కొండారెడ్డికి అర్ధమైపోయినట్లుంది. అందుకనే రివర్సు వ్యూహాన్ని అమలుచేసి ప్రభుత్వంపై ఒత్తిడి మొదలుపెట్టారు. ఎలాగంటే మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలతో రాజీనామాలు చేయిస్తామంటు బెదిరింపులకు దిగారు.

మండలంలో తనకు మద్దతుదారులుగా నిలిచే సర్పంచుల్లో 16 మంది, 9 మంది ఎంపీటీసీలతో తమ పదవులకు రాజీనామాలు చేయించే ఆలోచనలో కొండారెడ్డి ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.  ఇందులో నలుగురు సర్పంచులు కొండారెడ్డి పీఏ ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కలిసి విషయాన్ని వివరించి చెప్పారట. కొండారెడ్డిపై బహిష్కరణ వేటు వేస్తే తామంతా పదవులకు రాజీనామాలు చేయబోతున్నట్లు చెప్పారట. అయితే ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆమోదించటం మినహా చేయగలిగేది ఏమీ లేదని ఎంపీ తేల్చి చెప్పారట. దాంతో ఏమి చేయాలో తేల్చుకోలేక అందరు అక్కడినుండి వెళ్ళిపోయారు. మరి ఎస్పీ ప్రతిపాదనలపై కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.