కడపను వదిలి వెళ్లకుంటే బాంబులేస్తాం

కరుడుగట్టిన నేరస్తులకు సైతం వణుకు తెప్పించే సీబీఐ టీంకు అనూహ్యమైన షాకులు ఎదురవుతున్నాయి. దేశంలో మరెక్కడా లేని రీతిలో మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో భాగంగా కడప జిల్లాకు చేరిన సీబీఐ సిబ్బందికి ఎదురవుతున్న హెచ్చరికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సీబీఐ వైపు కన్నెత్తి చూసేందుకు సైతం ఆలోచించే నేరస్తులకు భిన్నంగా.. కడప జిల్లాలో మాత్రం సీబీఐ సిబ్బందికే బెదిరింపులు ఎదురైన వైనం ఇప్పుడు అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వివేకా హత్య కేసును ఒక కొలిక్కి తెచ్చేందుకు కష్టపడుతున్న సీబీఐ సిబ్బంది కడపను వదిలి వెళ్లకుంటే బాంబులేస్తామంటూ బెదిరించేస్తున్నారు.

వరుస పెట్టి ఎదురవుతున్న బెదిరింపులతో విచారణ మందగిస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే కడప జిల్లాకు వచ్చిన అధికారులు ఢిల్లీకి వెళ్లిపోగా.. మిగిలిన కొందరు సైతం తమకెందుకీ కష్టమన్నట్లుగా వారి తీరు ఉన్నట్లుగాతెలుస్తోంది. ప్రస్తుతం కడపలో సీబీఐకి చెందిన ఎస్ఐ స్థాయి అధికారితో పాటు కేవలం ముగ్గురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. రోజువారీ కార్యకలాపాల కోసం వారు రెండు వాహనాల్లో కడప ప్రభుత్వ అతిథి గృహం నుంచి కేంద్ర కారాగారం అతిథి గృహానికి వెళ్లి వస్తుంటారు. ఈ సందర్భంగా వారికి అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి.

నాలుగు రోజుల క్రితం (మే 8న) కడప సెంట్రల్ జైలుకు సమీపంలోని పంజాబీ డాబాకు భోజనం తెచ్చుకోవటానికి వెళ్లిన సీబీఐ డ్రైవర్ వలీభాషకు.. ముసుగు ధరించిన వ్యక్తి ఒకరు అడ్డగించి.. విజయవాడకు వెంటనే వెళ్లిపోవాలని లేకుంటే బాంబులేసి లేపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. వివేకా కేసు విచారణకు వెళ్లిన అధికారులకు ఇలాంటి బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. ముసుగు ధరించిన వ్యక్తి ఒకరు సీబీఐకు చెందిన వాహనాన్ని ఫాలో అవుతున్నట్లుగా చెబుతున్నారు. తమ వాహన కదలికల్ని వారం నుంచి గమనిస్తున్నట్లుగా సీబీఐ సిబ్బంది చెబుతున్నారు.

అంతేకాదు.. తాము చేస్తున్న ప్రతి పని వివరాల్ని డ్రైవర్ కు వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి పూసగుచ్చినట్లుగా చెప్పటం ద్వారా.. మీకు సంబంధించిన అన్ని వివరాలు మాకు తెలుసు.. మేం తలుచుకుంటే మిమ్మల్ని ఏదైనా చేయగలమన్న సందేశాన్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు. చివరకు హైకోర్టుకు వెళ్లేందుకు ట్రైన్ లో వెళ్లిన సందర్భంగా కారు పార్కింగ్ చేసిన వైనాన్ని కూడా ప్రస్తావించినట్లు చెబుతున్నారు. దీంతో.. తమకు ఎదురైన హెచ్చరికలపై తాజాగా సీబీఐ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏమైనా.. నేరస్తులకు సింహస్వప్నంగా ఉండే సీబీఐ సిబ్బందికి కడప జిల్లాలో రోటీన్ కు భిన్నమైన అనుభవాలు ఎదురవుతున్నట్లుగా చెబుతున్నారు.