వైసీపీ స‌ర్కారుపై వ్య‌తిరేక‌త ఉంది: రోజా

ఏపీ మంత్రి రోజా.. సీఎం జ‌గ‌న్ గాలిని అమాంతం తీసేశారు. ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడి యాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇవి సీఎం జ‌గ‌న్‌కే కాకుండా.. వైసీపీకి కూడా తీవ్ర ఇబ్బందిక‌రంగా ప‌రిణమించాయి. ఒక‌వైపు..తాము అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నామ‌ని.. ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను రెండు చేత‌లా ప్ర‌జ‌ల‌కు పంచిపెడుతున్నామ‌ని.. కాబ‌ట్టి.. త‌మ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక‌త ఎందుకు ఉంటుందని… సీఎం జ‌గ‌న్ ప్ర‌శ్నిస్తున్నారు.

అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 151 కాదు.. ఈ సంక్షేమ ల‌బ్ధి కార‌ణంగా 175/175 సీట్లు ఎందుకు తెచ్చుకోలేమని కూడా పార్టీ నేత‌ల‌ను ఆయ‌న ప్ర‌శ్నించారు. అంటే.. వైసీపీపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త లేద‌ని… జ‌గ‌న్ చెప్ప‌క‌నే చెబుతున్నారు. ఇక‌, మంత్రి జోగి ర‌మేష్ వంటివారు కూడా ఇదే మాట చెబుతున్నారు. వ్య‌తిరేక‌త ఎందుకు ఉంటుంద‌ని ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి ఇంత‌లా జ‌గ‌న్ కాన్ఫిడెంట్‌తో ఉంటే… మంత్రి రోజా మాత్రం.. ఆయ‌న గాలి తీసేసే వ్యాఖ్య‌లు చేశారు.

వైసీపీ స‌ర్కారుపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌ని రోజా చెప్పేశారు. అది కూడా మాజీ మంత్రులు.. జ‌గ‌న్‌కు క‌ర‌డు గ‌ట్టిన అభిమానులు అయిన‌..పేర్ని నాని, కొడాలి నాని వంటి దిగ్గ‌జ నాయ‌కుల స‌మ‌క్షంలోనే రోజా ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వానికైనా మూడు సంవత్స రాల తర్వాత ప్రజల నుంచి కొంత వ్యతిరేకత సహజంగానే వస్తుందని రోజా అన్నారు. దీనిని తెలుసుకుని, సరిదిద్దుకునేందుకే తమ ప్రభుత్వం ‘గడప గడపకు  వైసీపీ’ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళుతోందని తెలిపారు.

మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోజా మాట్లాడారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో భాగంగా మంత్రులు, శాసనసభ్యులు ఇంటింటికీ వెళ్తారని, ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనాలను ప్రజలకు వారు వివరిస్తారన్నారు. అధికారులు సహకరించాలని కోరారు. ప్ర‌తిప‌క్షం చెబుతున్నంత తీవ్ర వ్య‌తిరేక‌త ఉందా.. భారీ వ్య‌తిరేక‌త ఉందా.. అనే విష‌యాల‌ను తాను చెప్ప‌లేన‌ని.. అయితే.. వైసీపీపై మాత్రం వ్య‌తిరేక‌త ఉంద‌న్నారు.

గడప గడపకూ వైసీపీ కార్యక్రమం అనేకన్నా ‘గుండెగుండెలో జగనన్న’ అనే పేరు పెడితే బాగుంటుందన్నారు. ఇక‌,  ప్రతిపక్షం టీడీపీపై రోజా విమర్శలు గుప్పించారు. ‘‘టీడీపీ నాయకులు ఏనాడైనా చెప్పింది చేశారా, అధికారపార్టీపై నిందలువేస్తూ, వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ చంద్రబాబు, లోకేశ్‌, వారికి మద్దతిస్తున్న పవన్‌కల్యాణ్‌ రాష్ట్రానికి చీడపురుగులుగా మారారు’’ అని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచిందని టీడీపీ విషప్రచారం చేస్తోందని, టీడీపీ పాలనలో 22 వేల కోట్లు బకాయిలు పేరుకుపోవడం వల్లే కరెంటు చార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు.  మ‌రి రోజా వ్యాఖ్య‌ల‌పై స‌ల‌హాదారు స‌హా సీఎం ఏమంటారో చూడాలి.