కేటీఆర్‌ను ఓడిస్తా.. త్వ‌ర‌లో పాద‌యాత్ర:  కేఏ పాల్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్ర‌పంచ శాంతి దూత‌ కేఏ పాల్‌ విరుచుకుపడ్డారు. తనపై దాడి చేయించింది డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అనిల్ కుమార్ అని ఆరోపించారు. తాను వస్తున్నానని… ఇకపై తెలంగాణలో కేసీఆర్‌ ఆటలు సాగవని పేర్కొన్నారు. ‘తెలంగాణలో ఇక మీ ఆటలు సాగవు’ అని ప్రభుత్వంపై పాల్‌ మండిపడ్డారు. తాను ప్రపంచ శాంతి దూతగా రాలేదని… ప్రజాశాంతి పార్టీ అధినేతగా వచ్చానని పేర్కొన్నారు. కేసీఆర్‌ ఆటలు తెలంగాణలో సాగవని విరుచుకుపడ్డారు. దమ్ముంటే తనను ఆపాలని సవాల్ విసిరారు.

‘కేసీఆర్‌ గారు మీ ఆటలు తెలంగాణలో సాగవు.. నేను కేఏ పాల్ వస్తున్నా… మళ్లీ సిరిసిల్ల గడ్డకు వస్తున్నా… నన్ను చంపుతారా… అరెస్టు చేస్తారా.. దాడి చేస్తారా… చేయండి.. దేనికైనా సిద్ధం…“ అని స‌వాల్ విసిరారు. తనపై దాడి గురించి ఇంకా ప్రపంచ వ్యాప్తంగా తెలియలేదని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఉన్న జడ్జీలు, లాయర్లు అందరూ దీన్ని ఖండిస్తున్నారని తెలిపారు. తనపై దాడి చేయించింది డీఎస్పీ చంద్ర శేఖర్, సీఐ అనిల్‌ కుమార్‌ అని ఆరోపించారు. ఒక వ్యక్తి మాత్రమే తనపై దాడి చేసినట్లు చెప్పారు. ‘మీకు ప్రభుత్వం జీతాలు ఇస్తుందా.. కేసీఆర్, కేటీఆర్ జీతాలు ఇస్తున్నారా’ అని అడిగాను అంతే.. తనపై దాడికి దిగారని ఆవేదన చెందారు. గవర్నర్‌ తమిళిసై తనపై దాడిని ఖండించినట్లు వివరించారు.

‘గవర్నర్‌ గారు రాత్రి మెసేజ్ చేశారు. వైజాగ్‌లో ఉన్నారట.. రాగానే కలుద్దామన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి గారు వారిని సస్పెండ్ చేస్తారా.. చేయండి… లేదా నేను అమిత్‌ షాతో చేయించాలా.. లేదా కోర్టుకు వెళ్లాలా నేను… ప్రపంచం కోసం ఎన్నో యుద్ధాలు చేసిన నేను.. ఎందుకు భయపడుతా… ఇదంతా చేయించిందే ఎస్పీ.. అందుకే డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే.. గృహనిర్భంధం చేశారు. రేపు డీజీపీ నన్ను కలుస్తానని చెప్పారు.“ అని పాల్ వ్యాఖ్యానించారు.

అవినీతి లేని రాజ్యం కోసం పొరాడుదామని పిలుపునిచ్చారు కేేఏ పాల్‌. వచ్చే ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోందని తెలిపారు. మే 28న సాయంత్రం 5 నుంచి 9 గంటలకు పరేడ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ పెడుతున్నట్లు ప్రకటించారు. అందరూ రండి అని ఆహ్వానించారు. తమకు గ్రౌండ్ పర్మిషన్ ఉందని.. పోలీసులు పర్మిషన్‌ ఇవ్వకపోతే.. కోర్టుకు వెళ్తామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక అన్ని విచారణలు జరుపుతామన్నారు. ఒక సంవత్సరం ఆగుదామన్నారు. త్వరలో పాదయాత్ర చేపడుతానని ప్రకటించారు.

నేను కేటీఆర్ నియోజకవర్గంలో పోటీ చేసినా.. నేను గెలుస్తాను. ఎక్కడా చేసిన గెలుస్తా… ఏపీలో గతేడాది పోటీ చేశాను అనేది అబద్ధం.. జస్ట్ నామినేషన్ వేశాను. మా అమ్మగారికి బాలేకపోతే … అక్కడే ఉన్నాను… ఎన్టీఆర్‌కే 9నెలలు పట్టింది గెలవడానికి.. నాకు 6 నెలలైన పడుతోంది. నేను రుణపడి ఉంటే దేవుడికి, మీడియాకే రుణపడి ఉంటా… ఒక్కరూపాయి ఇవ్వకుండా మీరు ప్రచారం చేస్తున్నారు.. నా హృదయంలో మీరు ఉంటారు. తెలంగాణకు వచ్చి 3 సంవత్సరాలు అయింది. మార్చి నెలలో తెలంగాణ భవన్‌లో రైతులు కోసం ధర్నా చేశాను. అని పాల్ వివ‌రించారు.