లక్ష మందితో మహానాడు

ఒంగోలులో మే నెల 27,28 తేదీల్లో జరగబోయే టీడీపీ మహానాడుకు సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా. మహానాడు నిర్వహణపై చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నేతలతో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రెండు రాష్ట్రాల నుండి మహానాడు కార్యక్రమంలో సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా వేశారు. వీళ్ళందరికీ భోజన, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పార్టీపైనే ఉంటుందన్నారు.

ఇందుకోసం అవసరమైన జాగ్రత్తలు, చర్యలు తీసుకునేందుకు 15 కమిటీలను నియమించబోతున్నారు. ఒంగోలు పట్టణానికి  సమీపంలోని త్రోవగుంట బృందావన్ ఫంక్షన్ హాలు వెనకాలున్న 88 ఎకరాల్లో రెండు రోజుల మహానాడు నిర్వహణకు ఎంపిక చేశారు. కార్యక్రమం నిర్వహణకు అవసరమైన కరెంటు సరఫరా, మంచినీటి సరఫరా వెహికల్ పార్కింగ్ తదితరాలకు ముందుగానే పోలీసులు, విద్యుత్ శాఖ మున్సిపల్ అధికారుల నుండి అనుమతి తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.

మామూలుగానే మహానాడు కార్యక్రమం అంటేనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా మహానాడును మాత్రం టీడీపీ ఘనంగా నిర్వహిస్తుంది. కరోనా వైరస్ కారణంగా గడచిన రెండు సంవత్సరాలు మహానాడు కార్యక్రమాన్ని కేవలం జూమ్ యాప్ ద్వారా వర్చువల్ గా మాత్రమే నిర్వహించారు. ఇపుడు కోవిడ్ తీవ్రతతో పాటు ఆంక్షలు కూడా సడలించటంతో ప్రత్యక్షంగానే మహానాడు నిర్వహించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. దానికి తోడు తొందరలోనే ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ప్రతిష్టాత్మకంగా కూడా జరపాలని డిసైడ్ అయినట్లున్నారు.

27వ తేదీన విస్తృతస్థాయి సమావేశం, ఎన్టీఆర్ పుట్టినరోజైన 28వ తేదీన మహానాడు సమావేశం జరగబోతోంది. ఇదే రోజున బహిరంగ సభ కూడా ఉంటుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 28వ తేదీని మహానాడు గా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికలు, కరోనా వైరస్ లాంటి కారణాల వల్ల మాత్రమే మహానాడు రద్దయ్యింది. గుంటూరు, విజయవాడ, చీరాల, బాపట్ల, కావలి, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి జనాలు భారీఎత్తున హాజరవుతారని అనుకుంటున్నారు. అందుకనే ఏర్పాట్లు అంత భారీగా ఉండాలని చంద్రబాబు ఆదేశించింది.