తెలంగాణ సాధించినోళ్లం.. కేంద్రాన్ని సాధించ‌లేమా?

తెలంగాణ సాధించినోళ్లం.. కేంద్రంలో పాగా వేయ‌లేమా? అని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌శ్నిం చారు. టీఆర్ ఎస్ ప్లీన‌రీ ని ఉద్దేశించిన మాట్లాడిన ఆయ‌న గ‌తంలో తెలంగాణ కోసం.. ప‌డిన క‌ష్టాల‌ను వివ‌రించారు. ఇంత‌క‌న్నా క‌ష్ట‌ప‌డాలా..?  కేంద్రం కోసం.. అని ఆయ‌న ప్ర‌శ్నించారు. తెలంగాణ‌ను సాధించిన ఉత్తేజంతో కేంద్రంలోనూ పాగా వేయాల‌ని పిలుపునిచ్చారు.

నాడు తెలంగాణ కోసం.. తాను ఒక్క‌డిని అడుగు వేస్తే.. ఎన్నో అవ‌మానాలు వ‌చ్చాయ‌నితెలిపారు. ఇప్పుడు కూడా అలానే ఉన్నాయ‌ని.. అన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఎక్క‌డా వెనుక‌డుగు వేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. “2000లో నేను తెలంగాణ గురించి మాట్లాడితే తిన్నది అరగట్లేదా అన్నారు. నేను తల్లిదండ్రులు, భగవంతుడికి దండం పెట్టి అడుగు ముందుకేశాను. ఈ 20 ఏళ్లలో మన తెలంగాణ ఏ పరిస్థితుల్లో ఉందో చూడండి. 11 రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వలస వచ్చి ఉపాధి పొందుతున్నారు. కరోనా సమయంలో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండో సారి గెలిచాక రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లేలా పాలించాం.“ అని కేసీఆర్ వివ‌రించారు..

అంతేకాదు.. 85 శాతం మొక్కలు బతకకపోతే టీఆర్ ఎస్‌ వారైనా సర్పంచ్‌ పదవి పోతుందని చెప్పామ‌న్నా రు. పల్లెప్రగతి పేరిట ఏటా రెండు, మూడు సార్లు డ్రైవ్‌ నిర్వహిస్తున్నామ‌న్నారు. అందువల్లే పల్లె ప్రగతిలో 1 నుంచి 10 వరకు అవార్డులు వచ్చాయ‌న్నారు. కొన్ని వందల అవార్డులు కేంద్ర ప్రభుత్వమే మన రాష్ట్రానికి ఇచ్చిందని కేసీఆర్ వివ‌రించారు. దేశం ఒకే లక్ష్యం దిశగా సామూహిక పయనం చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు. లక్ష్యం లేని దిశలో చీకట్లో బాణం సంధిస్తున్నామని.. క్రమశిక్షణతో, పట్టుదలతో లక్ష్యాలను సాధించాలని తెలిపారు.

సాగుకు అందుబాటులో ఉండే భూమి పరంగా చైనా కంటే భారత్ ముందుందని.. అయినా భారత్‌ను మించి ఇవాళ చైనా పైస్థాయిలో ఎందుకు ఉందని ప్రశ్నించారు. తెలంగాణలో ఒక జిల్లా అంతలేని ఇజ్రాయిల్ నుంచి ఆయుధాలు కొంటున్నామన్న కేసీఆర్.. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, అపారమైన జలసంపద, ఖనిజ సంపదలున్న భారతదేశం మాత్రం ప్రగతిలో ఎందుకు వెనకబడి ఉంటుందని అడిగారు. అందుకే దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదని.. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించి.. ప్రజల అభ్యున్నతికి తోడ్పడే ప్రత్యామ్నాయ అజెండా రావాలని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే.. ప్లీన‌రీ మొత్తం.. కేంద్రంలోని అధికారం కోస‌మే అన్న‌ట్టుగా సాగింద‌నే గుస‌గుస‌లు వినిపించాయి.