చంద్రబాబు పక్కన బురద పాము.. జాగ్రత్త!

విశాఖపట్నం సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. విశాఖలో తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ శిక్షణ తరగతులు మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చింతకాయల మాట్లాడుతూ బయటకు వస్తున్న బురద పాములతో అందరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇపుడు పుట్టలో నుండి బయటకు వస్తున్న బురద పాము మూడేళ్ళుగా ఏ పుట్టలో ఉంది ఎవరికీ తెలీదన్నారు.

ఇలాంటి బురద పాము వల్ల పెద్దగా నష్టం లేనప్పటికీ చికాకులు మాత్రం తప్పవన్నారు. ఇంతకాలం ఎక్కడా కనబడని బురదపాము హఠాత్తుగా చంద్రబాబునాయుడు పక్కన కూర్చుని ఫోటోలకు ఫోజులు మాత్రం ఇస్తోందని ఎద్దేవా చేశారు. మూడేళ్లపాటు నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతుంటే కనబడని ఈ బురద పాము ఏ పుట్టలో దాక్కుందో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే చింతకాయల ఎవరు పేరును ప్రస్తావించకుండానే బురద పాము అన్నారు. చింతకాయల అన్నది పరోక్షంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావునే అనే ప్రచారం పార్టీలో పెరిగిపోతోంది. ఎందుకంటే వాళ్ళద్దరి మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటుంది. మొదటి నుండి వీళ్ళద్దరి మధ్య జిల్లాలో ఆధిపత్య గొడవలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. పార్టీలో పై స్ధాయిలో గంటాకు బాగా పట్టుంది కాబట్టి చక్రం తిప్పుతింటారు. ఇదే సమయంలో పార్టీలోని నేతలు, క్యాడర్లో చింతకాయలకు మంచిపేరుంది.

అందుకనే ఇద్దరిలో ఎవరికీ సర్ది చెప్పలేక చంద్రబాబు నాయుడు కూడా వదిలేస్తున్నారు. శిక్షణా తరగతుల్లో చింతకాయలన్నది గంటాను ఉద్దేశించే అని అందరికీ అర్ధమైపోయింది. ఎందుకంటే మూడేళ్ళుగా పార్టీ కార్యక్రమాల్లో అడ్రస్ కనబడకుండా తిరుగుతున్నది గంటా మాత్రమే. కేవలం తన మద్దతుదారులతో మాత్రమే గంటా టచ్ లో ఉన్నారు. చివరకు చంద్రబాబుతో కూడా గంటా టచ్ లో లేరు. చంద్రబాబు వైజాగ్ పర్యటనలో కూడా ఎక్కడా కనబడలేదు. అలాంటిది మొన్నటికి మొన్న చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మాత్రం గంటా ఆర్భాటంగా కార్యక్రమం నిర్వహించారు. అందుకనే చింతకాయల బురదపాము అంటు గంటాపై పరోక్షంగా రెచ్చిపోయారు.