కాంగ్రెస్ సెంటిమెంటు వర్కవుటవుతుందా ?

కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధి బహిరంగ సభను వచ్చే నెలలో వరంగల్ జిల్లాలో నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయ్యింది. వరంగల్లోనే బహిరంగసభ ఎందుకు నిర్వహిస్తోంది ? ఎందుకంటే సెంటిమెంటు ప్రకారం పార్టీకి వరంగల్ జిల్లా బాగా కలిసొచ్చిందట. 2004లో వరంగల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రెండు బహిరంగసభలు బ్రహ్మాండంగా సక్సెస్ కొట్టాయి. అదే ఊపులో అధికారంలోకి కూడా వచ్చేసింది.

అందుకనే అప్పటినుండి గాంధీ ఫ్యామిలితో బహిరంగసభ నిర్వహణ అంటే ముందుగా వరంగల్ జిల్లానే గుర్తుకొస్తోంది. పైగా వచ్చే నెలలో జరగబోయే బహిరంగసభను వరంగల్లోనే జరపాలని స్వయంగా రాహులే సూచించినట్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పటం గమనార్హం. సభను గ్రాండ్ సక్సెస్ చేయటంలో భాగంగా ఇప్పటికే బహిరంగసభ నిర్వహణ విషయంలో జిల్లా నేతలతో రేవంత్ రెండుసార్లు సమావేశమయ్యారు.

జిల్లా నేతల మధ్య కావాల్సినన్ని  మనస్పర్ధలున్నాయి. బహిరంగసభ గ్రాండ్ సక్సెస్ చేయటం కోసం నేతల మధ్య ఉన్న విబేధాలను పక్కనపెట్టాలంటు రేవంత్ పదే పదే చెబుతున్నారు. అందరు సమిష్టిగా కష్టపడితేనే బహిరంగసభ సక్సెస్ అవుతుందన్న విషయాన్ని రేవంత్ గుర్తుచేస్తున్నారు. గతంలో ఏ పార్టీ ఆధ్వర్యంలో కూడా జరగనంత భారీస్ధాయిలో రాహుల్ సభ జరగాలన్న విషయాన్ని రేవంత్ అందరికీ స్పష్టంగా చెప్పారు.

రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటమన్నది రాహుల్ సభ సక్సెస్ మీదే ఆధారపడుందనే సెంటుమెంటును రేవంత్ స్పష్టంచేశారు. జిల్లా నలుమూలల నుండి జనసేకరణకు నేతలంతా కష్టపడాల్సిందే అన్నారు. బహిరంగ సక్సెస్ కావటాన్ని ప్రతినేత తన పరిధిలో ప్రిస్టేజ్ గా తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు చెబుతున్నారు.

రేవంత్ పీసీసీ చీఫ్ అయినతర్వాత పార్టీలోను, కార్యకర్తల్లోను ఊపు వచ్చినమాట వాస్తవం. ఇంకా కొందరు సీనియర్లలో అసంతృప్తి ఉన్నప్పటికీ అది నామమాత్రమే అని రేవంత్ అనుకుంటున్నారు. అధిష్టానం మద్దతు కారణంగా హోలు మొత్తంమీద సీనియర్లలో చాలామంది రాజీ పడిపోయారు. మరి కాంగ్రెస్ కు వరంగల్ సభ సెంటిమెంటు కలిసొస్తుందా ?