జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. అమ‌రావ‌తిలో నిర్మాణాలు షురూ

అమ‌రావ‌తి వ‌ద్దంటే వ‌ద్ద‌ని భీష్మించిన ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారు.. ఎట్ట‌కేల‌కు హైకోర్టు తీర్పుతో దిగి వ‌చ్చింది. రాజధాని అమరావతిలో పనులు ప్రారంభించింది. రాయపూడిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస గృహాల్లో మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు.. అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో ఈ భవనాలను నిర్మించిన ఎన్సీసీ సంస్థకే.. నిర్మాణ పనులను అప్పగించారు. శాసనసభ్యుల నివాసాల్లో టైల్స్, నీటి పైపులు, విద్యుత్‌ కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే నిర్మాణ సామాగ్రిని రాయపూడికి తరలించారు.

సోమవారం నుంచి భారీస్థాయిలో మరింత మంది కూలీలు రానున్నారని నిర్మాణ సంస్థ అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా పనలు పూర్తిచేసి ప్రభుత్వానికి అప్పగిస్తామని చెప్పారు. మరోవైపు పనులకు వచ్చిన కార్మికులకు రాజధాని రైతులు గులాబీ పూలు ఇచ్చి స్వాగతం పలికారు. మళ్లీ అమరావతి పనులు చేసేందుకు వచ్చిన కూలీలను అభినందించారు. ప్లాట్లను కూడా త్వరగా అభివృద్ధి చేసి అప్పగించాలని రైతులు డిమాండ్ చేశారు. మొత్త‌గా సీఎం జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యంతో నిన్న‌టి వ‌ర‌కు.. అడియాస‌ల్లో ఉన్న అన్న‌దాత‌లు.. ఒకింత ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. అయితే.. ప‌నులు మొద‌లు కావ‌డంతో అదేస‌మ‌యంలో సంతోషం వ్య‌క్తం చేశారు.

హైకోర్టు తీర్పుతో..

రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రానికి ఓ మహానగరం నిర్మిద్దామన్న గత ప్రభుత్వ పిలుపుతో అమరావతి రైతులు ముందుకొచ్చారు. ల్యాండ్‌పూలింగ్‌ విధానంతో ఏళ్లుగా జీవనాధారమైన భూములను ప్రభుత్వం మీద నమ్మకంతో ఇచ్చారు. సాక్షాత్తూ ప్రధాని మోడీ  వచ్చి నూతన రాజధానికి శంకుస్థాపన చేయడంతో అభివృద్ధికి ఢోకా లేదనుకున్నారు. నిర్మాణాలూ ప్రారంభమై.. కొన్ని పూర్తయ్యాయి. ప్రభుత్వ కార్యాకలాపాలు అమరావతి నుంచే జరగడం మొదలైంది.

ఇంతలో ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారింది. రాజధాని మీద నిర్ణయమూ మారింది. 3 రాజధానులంటూ కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారు. భవిష్యత్‌ ఆశలు కళ్లముందే కూలిపోవడంతో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రానికి గొడ్డలిపెట్టులా మారుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. నిర్ణయం మార్చుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని మొరపెట్టుకున్నారు. అయినా పాలకుల్లో మార్పు రాలేదు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదంటూ..అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నారు.  

కడుపు మండిన అన్నదాతలు రోడ్డెక్కారు. ప్రభుత్వ నిర్ణయం అనాలోచితమంటూ ఆందోళనకు దిగారు. వివిధ రూపాల్లో నిరసనలు పెల్లుబికాయి. రెండు చట్టాల్ని హైకోర్టులో సవాల్ చేయడంతో..వాటిపై న్యాయస్థానం స్టేటస్‌ కో విధించింది. ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. శిబిరాల్లో ఆందోళనలు, దేవతలకు విన్నపాలు, న్యాయస్థానం-దేవస్థానం పేరిట పాదయాత్రలతో నిరసనలు హోరెత్తించారు.

ఎట్ట‌కేల‌కు ఏకైక రాజధానిగా అమరావతినే అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించింది. అమరావతి మాస్టర్‌ప్లాన్‌ని తప్పనిసరిగా అమలుచేయాలని.. పురోగతికి ఎప్పటికప్పుడు వివరించాలని తేల్చిచెప్పింది. దీంతో రైతులు హర్షం వ్యక్తంచేశారు. తమ పోరాటం ఫలించిందని సంతోషం వెలిబుచ్చారు. అయితే.. గ‌డువు ముగిసిపోతున్నందున జ‌గ‌న్ స‌ర్కారు ఎట్ట‌కేల‌కు ఇక్క‌డ ప‌నులు ప్రారంభించ‌డం విశేషం.