పవన్ యాత్రకు చిక్కులు.. ఏపీ రాజకీయాల్ని వేడెక్కిస్తున్న ‘జేసీబీ’

జాతీయ.. అంతర్జాతీయంగా ‘జేసీబీ’ యంత్రం కారణంగా సాగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్రమార్కులు.. నేరస్తులు.. ఆందోళనతో ఆరాచకాన్ని క్రియేట్ చేసే వారి ఇళ్లను జేసీబీలతో ధ్వంసం చేయటం.. యూపీలో సక్సెస్ ఫార్ములాగా మారిన నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల్లోనూ అలాంటి విధానాలకు తెర తీస్తున్నారు. దీంతో.. జేసీబీలతో ఆరాచక పాలన సాగిస్తున్నారంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జేసీబీలను వినియోగిస్తున్న వైనాన్ని చూసిన ఏపీ అధికారులు.. తమ మెదళ్లకు పని పెట్టినట్లుగా కనిపిస్తోంది.

సంఘ విద్రోక శక్తులకు భరతం పట్టేందుకు జేసీబీలు వాడే తీరును మరికాస్త డెవలప్ చేసి.. రాజకీయ ప్రతీకారాలకు వినియోగించేలా ఎత్తులు వేస్తున్న వైనం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త అలజడిగా మారుతోంది. ఏపీ అధికార పక్షమైన వైసీపీకి.. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి పట్టని కౌలు రౌతుల ఆత్మహత్యల అంశాన్ని టేకప్ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గడిచిన కొద్ది రోజులుగా ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత రైతులకు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న 41 కౌలు రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం అందించేందుకు పవన్ కల్యాణ్ తానే స్వయంగా రంగంలోకి దిగారు. బాధిత కుటుంబాలను స్వయంగా కలిసి వారి సమస్యల్ని తెలుసుకొని.. పరిష్కారం కోసం పోరాడేందుకు వీలుగా సమాయత్తమవుతున్నారు. ఇదిలా ఉంటే.. పవన్ రైతు భరోసా యాత్రకు ఆటంకం కలిగించేందుకు వీలుగా కొన్నిచోట్ల రోడ్లను జేసీబీలతో తవ్వేస్తున్న వైనంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పవన్ పర్యటన వేళ ఇలాంటి చికాకులు ఎదురయ్యేలా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

విపక్షంలో ఉన్న వేళ జగన్ చేసిన పాదయాత్ర సమయంలోనూ నాటి అధికారపక్షం ఇదే తీరుతో వ్యవహరించి ఉంటే.. ఆయన అసలు పాదయాత్రను చేసే వారేనా? అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన జేసీబీలు ఏపీ అధికారుల పుణ్యమా అని ఇక్కడా రాజకీయ అలజడికి తెర తీస్తున్నారని చెప్పాలి. జేసీబీలు.. ఏపీ రాజకీయాల్ని ఏ రీతిలో మారుస్తాయో చూడాల్సిందే.