‘KCR కేబినెట్ నుంచి న‌న్ను తప్పించేందుకు కుట్ర‌లు’

క‌మ్మ సామాజిక‌వ‌ర్గంపై కుట్ర‌లు చేస్తున్నార‌ని.. అదే సామాజిక‌వ ర్గానికి చెందిన త‌న‌ను కేసీఆర్ కేబినెట్ నుంచి త‌ప్పించేందుకు కొంద‌రు కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని.. తెలంగాణ ర‌వాణా శాఖ మంత్రి, ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజ‌య్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ స‌మ‌యంలో క‌మ్మ‌ల‌ను క‌మ్మ‌లే కాపాడుకోవాల‌ని అన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన బీజేపీ కార్య‌క‌ర్త సాయిగ‌ణేష్ ఆత్మ‌హ‌త్య ఉదంతాన్ని ప‌రోక్షంగా ప్ర‌స్తావించిన మంత్రి.. చిన్న విషయాలను కొందరు రాద్దాంతం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్దేశ పూర్వకంగానే కమ్మ సామాజిక మంత్రులపై కుట్రలు పన్నుతున్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తానొక్కడినే కమ్మ మంత్రినని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. కావాలనే కొంతమంది తనపై కుట్ర పన్నుతున్నారని మంత్రి అజయ్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గానికి రాజ్యాధికారం లేకుండా చేసేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్మించిన కమ్మ మహాజన సమితి కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఉన్న ఒక మంత్రిని పక్కకు తప్పించారని గుర్తు చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కమ్మ సామాజిక వర్గంలో నాకు మంత్రి పదవి ఇవ్వటం నిజంగా అదృష్టమని పువ్వాడ  అన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో కమ్మ సామాజికవర్గానికి చెందిన మంత్రి కొడాలి నానిని తొలగించారని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కమ్మ సామాజికవర్గం నుంచి నన్ను తొలగించేందుకు నాపై నిందలు మోపి కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. మంత్రులపై కుట్రలు చేసి పదవుల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దీనికి కొందరు చౌద‌రిలే సహకారం చేస్తున్నాయని పరోక్షంగా మండిపడ్డారు.

అందుకే కమ్మ సామాజిక వర్గమంతా రాజకీయాలకు అతీతంగా ఐక్యతగా ఉద్యమించాలని పువ్వాడ సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వల్ల కమ్మ సామాజిక వర్గం అభివృద్ధి చెందిందని ఆయన వెల్లడించారు. ఎన్టీ రామారావు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశారని తెలిపారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానంగా కమ్మ మహాజన సంఘానికి ఎక్కువ పదవులు ఇచ్చి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

రాజకీయంగా కమ్మ నేతల ఎదుగుదలను ఓర్వలేక చేస్తున్న కుటిల ప్రయత్నాలపై ఐక్యంగా పోరాడాలని పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు.“మన సామాజిక వర్గంపై తెలుగు రాష్ట్రాల్లో దాడి జరుగుతోంది. కేసీఆర్ కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. కొంతమంది మనపై కుట్రలు చేస్తున్నారు. దీనిపై మనమంతా ఐక్యంగా ఉండి పోరాడాలి. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు బలహీన వర్గాల సాధికారతకు కృషి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ మహనీయుడు ఒక గొప్ప రాజకీయ మార్పు తీసుకొచ్చాడు. కేసీఆర్ కూడా ఎన్టీఆర్ తరహాలో పాలన సాగిస్తున్నారు. ఏపీలో మాత్రం ఉన్న కమ్మ సామాజిక వర్గ మంత్రిని కూడా పీకేశారు“ అని పువ్వాడ వ్యాఖ్యానించారు.