జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..

బోలెడంత మంది సలహాదారుల్ని చుట్టూ పెట్టుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. తాను తీసుకునే నిర్ణయాల్ని సొంతంగా తీసుకుంటారా? ఎవరైనా ఇచ్చినవి వాడతారా? అన్న తరచూ ఒక పెద్ద సందేహంగా మారుతూ ఉంటుంది. ఒకవేళ తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నా.. ఆయన్ను నిలువరించేంత ధైర్యం ఎవరికి లేదంటారు. ఇదే జగన్ సర్కారుకు ఒక పెద్ద మైనస్ గా మారిందన్న మాట వినిపిస్తోంది. వరుస పెట్టి తీసుకుంటున్న నిర్ణయాలు అత్యున్నత కోర్టుల్లో వీగిపోవటం.. ఎదురుదెబ్బలు తగలటం రివాజుగా మారింది.

తాజాగా అలాంటిదే మరొక అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాల్ని జారీ చేసింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి.. చంద్రబాబు హయాంలో కీలకంగా వ్యవహరించిన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును జగన్ ప్రభుత్వంలో సస్పెన్షన్ వేటుకు గురి కావటం తెలిసిందే. దీనిపై ఆయన సుప్రీంను ఆశ్రయించారు. ఈ సందర్భంగా విచారణ జరిపిన కోర్టు.. చివరకు తన తీర్పును ఇచ్చింది. దీని ప్రకారం ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను రద్దు చేయటంతో పాటు.. ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని పేర్కొంది.

అంతేకాదు.. ఈ ఉదంతంపై ఏపీ ప్రభత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను తోసిపుచ్చింది.
రెండేళ్లకు మించి సస్పెన్షన్ కొనసాగించటం సాధ్యం కాదన్న సుప్రీంకోర్టు.. ఏబీవీని మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని కోరింది. ఈ బెంచ్ కు త్రిసభ్య టీం తమ తదుపరి ఆదేశాల్ని జారీ చేసింది. అసలేం జరిగిందంటే.. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ నిబంధనల్ని అతిక్రమించి నిర్ణయాల్ని తీసుకుంటున్నారంటూ ఏపీ ప్రభుత్వం ఆయన్ను విధుల నుంచి తొలగించింది.

భద్రతా ఉపకరణాల కొనుగోలులో నిబంధనల్ని అతిక్రమించినట్లుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి.. ఏపీ ప్రభుత్వ సస్పెన్షన్ ను సవాలు చేస్తూ ఏబీవీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదోపవాదాలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా ఏబీవీని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. మరి.. దీనిపై జగన్ సర్కారు ఏ రీతిలో రియాక్టు కానుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పాలి.