జగన్ తీసుకున్న క్లాసు సరిపోతుందా?

నేతల మధ్య పంచాయితీలు ముదిరిపోకుండా ఎప్పటికప్పుడు సర్దుబాటు చేయకపోతే అవే పంచాయితీలు ముందు ముందు బాగా ముదిరిపోతాయని అందరికీ తెలిసిందే. పంచాయితీ సర్దుబాటు విషయంలో జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసిందిదే. నెల్లూరులో తాజా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి తాజా మాజీ అనిల్ కుమార్ యాదవ్ మధ్య విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే. వీళ్ళ మధ్య విభేదాలు చాలాకాలంగా ఉన్నా ఎప్పుడూ బహిరంగం కాలేదు.

అయితే క్యాబినెట్లోకి అనిల్ బదులు కాకాణి చేరగానే విభేదాలు ఒక్కసారిగా బయట పడ్డాయి. ఇద్దరు ఒకరిపై మరొకరు డైరెక్టుగా ఆరోపణలు, విమర్శలు చేసుకోకపోయినా వాళ్ళమధ్య విభేదాలున్నాయనే విషయం మాత్రం బయటపడ్డాయి. మంత్రయిన తర్వాత మొదటిసారి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరుకు వచ్చిన రోజే మాజీ మంత్రి అనిల్ నెల్లూరు పట్టణంలో తన మద్దతుదారులతో సమావేశం పెట్టారు.

ఒకవైపు పార్టీ ఆఫీసుకు కాకాణి వస్తున్నపుడు అనిల్ హాజరుకాకుండా అదే సమయంలో సొంతంగా సభ పెట్టుకోవటంతోనే వీళ్ళ మధ్య విభేదాలున్నాయని అర్థమైంది. అనీల్ మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి తన నియోజకవర్గమైన సర్వేపల్లిలోకి అడుగుపెట్టనివ్వలేదని పార్టీలోనే ప్రచారంలో ఉంది. అంటే వాళ్ళ మధ్య విభేదాలు అంత స్థాయిలో ఉన్నాయి మరి. అలాంటిది ఇపుడు విభేదాలు లేవంటే ఎవరు నమ్ముతారు ? ఈ విషయం పెరిగి పార్టీకి నష్టం జరగకూడదనే జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకున్నారు.

ఇద్దరినీ పిలిపించి గట్టిగానే క్లాసు పీకినట్లు ప్రచారంలో ఉంది. ఇద్దరి మధ్య విభేదాల వల్ల పార్టీ నష్టపోతుందన్న విషయాన్ని జగన్ గుర్తుచేశారట. ఇలాంటి విభేదాలు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోమని గట్టిగా చెప్పారట. దాంతో ఇద్దరూ తలూపి బయటకు వచ్చారట. గతంలో కూడా కాకాణి-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మధ్య విభేదాలు వచ్చినపుడు కూడా జగన్ క్లాసు పీకినట్లు పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఆ క్లాసు తర్వాత వారిద్దరు మళ్ళీ నోరిప్పలేదు. అంటే ఇపుడు జరిగింది చూస్తుంటే వీళ్ళిద్దరికీ తీసుకున్న క్లాసు సరిపోతుందనే అనుకుంటున్నారు. వీళ్ళకి తీసుకున్న క్లాసు సరిపోయిందా లేదా అన్నది కొంతకాలం అయితే కానీ తేలదు.