సీఎం సర్దుకు పొమ్మన్నారు.. మంత్రి వ్యాఖ్యలు

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల రచ్చపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల వివాదం సహా అనేక అంశాలను సీరియస్ గా తీసుకున్న సీఎం.. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని తాజాగా `క్లాస్` ఇచ్చారు. ఈ విషయంపై కాకాణి, అనిల్ ఇద్ద‌రు వేర్వేరుగా నెల్లూరు నుంచి  సీఎం క్యాంపు కార్యాల‌యానికి వ‌చ్చారు.  కార్యాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. ఇరు నేతల మధ్య విభేధాలను సీఎం పరిష్కరించారు. దీనిపై మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఒక్క‌రే మీడియాతో మాట్లాడ‌గా.. అనిల్ ఎవ‌రితోనూ మ‌ట్లాడ‌కుండా.. నెల్లూరు వెళ్లిపోయారు.

మంత్రి ఏమ‌న్నారంటే..
మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా నేతలతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ ముగిసిన అనంతరం.. మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు.  సీఎంను కలవడంలో పెద్ద విశేషం లేదన్న కాకాణి.. అభివృద్ధి, సంక్షేమం, జిల్లా పనులకు సంబంధించే విషయాలపైనే చర్చించడం జరిగిందని చెప్పారు. కొత్త జిల్లాల ఇంఛార్జిల నియామకం నేపథ్యంలోనే ఈ భేటీ జరిగిందన్నారు. ‘మా జిల్లా అభివృద్ధి విషయాలపై సీఎంతో చర్చించాం. అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని సీఎం జగన్‌ చెప్పారు. మా మధ్య విభేదాలు ఉంటే కదా చర్చించడానికి!“ అని వ్యాఖ్యానించారు.

అనిల్‌తో విభేదాలన్నది మీడియా సృష్టేన‌ని చెప్పారు. పార్టీ కోసం అందరం కలిసి పనిచేస్తామ‌ని కాకాణి చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడూ అనిల్, నేను కలిసే పనిచేశామ‌న్నారు. అనిల్ నాకు సోదరుడి లాంటి వాడని, కావాలనే  మా మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం చేశారని  పేర్కొన్నారు.  తాము ఎక్కడా పోటా పోటీ సభలు ఎక్కడా నిర్వహించ లేదన్నారు. పోటా పోటీ సభలు అనేవి కేవలం మీడియా సృష్టే అని పేర్కొన్నారు. నెల్లూరులో అంతా ఫ్రెండ్లీ వాతావరణం ఉంది అని కాకాణి చెప్పారు.

నీడనిచ్చే చెట్టును నరుక్కునే మూర్ఖులం అయితే తాము కాదని తెలిపారు. సీఎం జగన్ తిరిగి సీఎం కావడమే లక్ష్యంగా తాము పని చేస్తాం అని చెప్పారు. నెల్లూరులో ఎవరి  ఫ్లక్సీలు ఎవరూ చింపలేదు అని వివరించారు. ఇరువురూ సమన్వయంతో పనిచేయాలని సీఎం జగన్ తమను ఆదేశించారు అని తెలిపారు. పార్టీ అభివృద్ది సంక్షేమం గురించే సీఎంతో మాట్లాడాం.. అని, ఇతర ఎలాంటి అంశాలు చర్చకు రాలేదు అని మంత్రి తెలిపారు.

ఏం జ‌రిగింది?

అధికార వైకాపాలో నెలకొన్న ఆధిపత్య పోరు, వర్గ విభేదాలతో నెల్లూరులో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. తాజాగా మంత్రి కాకాణి ఫ్లెక్సీలు తొలగించటంపై ఆనం సోదరులు మండిపడ్డారు. నెల్లూరులో అరాచకం రాజ్యమేలుతోందని, మంత్రి స్వాగత ఫ్లెక్సీలను సైతం చించేశారని ఆనం జయకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలోనే అధిష్టానం జోక్యం చేసుకుని ప‌రిస్థితిని స‌ర్దుబాటు చేసింది. మ‌రి ఇప్ప‌టిక‌నా.. ఇవి స‌ర్దుబాటు అవుతాయా.. లేక క‌కొన‌సాగుతాయా?  చూడాలి.