ద‌ళిత బంధు నిధుల‌పై కేటీఆర్ క్లాస్‌

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న ద‌ళిత బంధు నిధులను విడ‌త‌ల వారీగా విడుద‌ల చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప‌థ‌కంపై అనేక విమ‌ర్శ‌లు.. అవినీతి ఆరోప‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి. అయినా.. వాటిని ప‌ట్టించుకోని.. స‌ర్కారు. నిధుల విష‌యంలో ఎలా వినియోగించుకోవాలో.. ఏది కొనాలో.. ఏది కొనొద్దో.. క్లాస్ పీకుతోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు.. మ‌రికొంద‌రు ఈ డ‌బ్బులు ఏవో త‌మ జేబుల్లోంచి ఇస్తున్న‌ట్టుగా మంత్రులు ఫీల‌వుతున్నార‌నే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత దుమారం రేపాయి. “దళితబంధు నిధులతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లే కొంటామంటే నేను రాను.” అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

“రాష్ట్రంలో దళితబంధు నిధులతో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. రూపాయి పెట్టుబడితో రూపాయిన్నర రాబడి గురించి ఆలోచించాలి. దేశంలో మంచి పని చేయడానికి లక్ష తొంభై అడ్డంకులు ఉంటాయి. కానీ చెడు పని చేయడానికి ఒక్కటి అడ్డంరాదు. దళితబంధు నిధులతో పలు రకాల వ్యాపారాలు చేస్తామని లబ్ధిదారులు అంటున్నారు. ముగ్గురు, నలుగురు కలిసి ఉమ్మడి వ్యాపారం చేస్తే మరింతగా వృద్ధి సాధించవచ్చు. కేవలం ఎస్సీలకే కాదు.. క్రమంగా మిగతా వర్గాలకు దళితబంధు తరహా పథకం ఇస్తాం. సమాజంలో రెండే కులాలున్నాయి.. పేద కులం, ధనిక కులం. దళితబంధు నిధులతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లే కొంటామంటే నేను రాను. గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు దళితబంధు పథకాన్ని విజయవంతం చేయాలి.” అని సూచించారు.

దళితబంధు పథకంతో దళితుల రూపురేఖలు మార్చడానికి ఆలోచించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లాలో దళితబంధు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దళితబంధు విజయవంతం కావాలని ఆయన కోరారు. 119 మంది కుటుంబాలకు దళితబంధు నిధులను పంపిణీ చేశారు. దళితబంధు నిధులతో అందరూ వాహనాలే కాకుండా… వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టి సంపదను రెట్టింపు చేసుకోవాలని కోరారు. దళితబంధు నిధులతో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చని ఆయన తెలిపారు.

దళితబంధు నిధులతో కొందరు ఒకే రకమైన వ్యాపారాలకు ప్రాధాన్యమిస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. ట్రాక్టర్లు, హార్వెస్టర్ల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారన్న ఆయన… ముగ్గురు, నలుగురు కలిసి వ్యాపారం చేస్తే మరింతగా అభివృద్ధి చెందుతుందని సూచించారు. ఎస్సీలనే కాదు.. క్రమంగా మిగతా వర్గాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కొత్త ఆలోచనలు చేసి దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ చిన్న పనులు చేసే వ్యక్తి కాదు. కేసీఆర్‌.. ఒక రిఫార్మర్‌, సమాజంలో మార్పు కోరుకొనే వ్యక్తి. 1987లో భారత్‌, చైనా రెండింటి జీడీపీ 470 బి.డాలర్లు. ఈ 35 ఏళ్లలో యూరప్‌, జపాన్‌తో చైనా పోటీపడింది. కులం, మతం జోలికెళ్లకుండా పెట్టుబడులకు పోటీ పడ్డారు. ఇప్పుడు మన దేశ జీడీపీ 2.93 ట్రిలియన్‌ డాలర్లు. ఇప్పుడు చైనా జీడీపీ 16 ట్రిలియన్ డాలర్లు. మన దేశంలో తలసారి ఆదాయం రూ.2వేల డాలర్లు. చైనా తలసరి ఆదాయం రూ.14వేల డాలర్లు. మనం కులం, మతం గొడవలంటూ అక్కడే ఉన్నాం. అని వ్యాఖ్యానించారు.