ఫెయిల్ అయిన జగన్ ఆలోచనలు

మంత్రివర్గం కూర్పులో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు నూరుశాతం సక్సెస్ కాలేదనే చెప్పాలి. వివిధ కారణాల వల్ల కొందరి విషయంలో రాజీపడాల్సొచ్చింది. మూడేళ్ళ క్రితం మంత్రివర్గం ఏర్పడినపుడు రెండున్నరేళ్ళ తర్వాత 90 శాతం మందిని మార్చేస్తానని ప్రకటించారు. సరే తర్వాత జరిగిన అనేక పరిణామాల కారణంగా మూడేళ్ళవుతున్న సమయంలో కొత్త క్యాబినెట్ ఏర్పాటు కాబోతోంది. పాత+కొత్త మంత్రుల కాంబినేషన్ తో జగన్ క్యాబినెట్-2 సోమవారం ఉదయం కొలువు తీరబోతోంది.

జగన్ మొదట్లోనే చెప్పినట్లు 90 శాతం మందిని మార్చేయటం సాధ్యంకాలేదు. అందుకనే ఐదారుగురు పాత మంత్రులు కొత్త క్యాబినెట్లో కూడా ఉంటారని లీకులిచ్చారు. తర్వాత ఆ సంఖ్య ఎనిమిది దాకా ఉంటుందని రెండోసారి లీకులిచ్చారు. చివరకు 11 మంది పాత మంత్రులను కొత్త క్యాబినెట్లో కూడా కంటిన్యు చేయబోతున్నారు. అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే జగన్ ఆలోచనలు నూరుశాతం ఆచరణ సాధ్యంకాలేదని.

పార్టీ, ప్రభుత్వంపై తిరుగులేని ఆధిపత్యం ఉన్నప్పటికీ తన ఆలోచనలను నూరుశాతం జగన్ అమలు చేయలేకపోవటం ఆశ్చర్యంగానే ఉంది. సీనియారిటి, సామర్ధ్యం, సామాజికవర్గాలు తదితర కాంబినేషన్లను చూసుకున్న తర్వాత జగన్ ఆలోచనలు పూర్తిగా ఆచరణ సాధ్యంకాలేదని అర్ధమవుతోంది. మూడేళ్ళ క్రితం మంత్రివర్గం ఏర్పాటులో జగన్ పెద్దగా కసరత్తు చేసినట్లు అనిపించలేదు. కానీ తాజా పునర్ వ్యవస్ధీకరణ విషయంలో మాత్రం చాలా పెద్ద కసరత్తే అవసరమైనట్లుంది.

సోషల్ ఇంజనీరింగ్ ను ఫాలో అవటం కావచ్చు, కొందరి నుండి వచ్చిన ఒత్తిళ్ళు కావచ్చు, మరికొందరిని కొంటిన్యుచేయక తప్పని అనివార్యత కావచ్చు జగన్ క్యాబినెట్-2 కూర్పు అంత ఈజీగా అయితే జరగలేదనటం వాస్తవం. కొత్త క్యాబినెట్ కూర్ప తర్వాత రెండు అంశాలు కీలకం కానున్నాయి. అవేమిటంటే ఉపముఖ్యమంత్రులుగా ఎవరిని తీసుకుంటారనేది కీలకమైంది. అలాగే తాజా మాజీ మంత్రుల సేవలను ఎలా ఉపయోగించుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ఏదేమైనా ఇపుడు కొత్తగా ఏర్పాటవబోతున్నది ఎన్నికల క్యాబినెట్ అనటంలో సందేహంలేదు.