ఆ నాట‌కీయ‌త ఇక ప‌నికి రాదు జ‌గ‌న్‌

ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్న‌పుడు ఏం చేసినా చెల్లుతుంది. కానీ ప్ర‌తికూల ప‌రిస్థితులు మొద‌ల‌య్యాక అతి చేస్తే తిర‌గ‌బ‌డుతుంది. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విష‌యంలో ఇదే జ‌రుగుతున్న‌ట్లుగా అనిపిస్తోంది. ఆయ‌న మామూలుగా ఎంత నాట‌కీయంగా మాట్లాడ‌తారో తెలిసిందే. మిగతా రాజ‌కీయ నాయ‌కుల్లా ఆయ‌న ప్ర‌జ‌లు, జ‌నాలు అనే మాట‌లు వాడ‌రు. అక్క చెల్లెమ్మ‌లు..  ఆడ‌బిడ్డ‌లు.. అన్న‌ద‌మ్ములు..  పేద‌వాడు.. చిన్నారులు.. ఇలాంటి ప‌దాల‌తోనే క‌నిక‌ట్టు చేసే ప్ర‌య‌త్నం చేస్తుంటారు.

జ‌నాల‌కు త‌న‌ను బాగా ద‌గ్గ‌ర చేసుకుంటూ చాలా నాట‌కీయంగా మాట్లాడుతంటారాయ‌న‌. విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యే, వివాదాస్ప‌ద‌ విష‌యాల్లో కూడా త‌న త‌ప్పేమీ లేదు అన్న‌ట్లు, ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కుల మీద నింద‌లేస్తూ నాట‌కీయంగా మాట్లాడ‌టంలో జ‌గ‌న్ నేర్పే వేరు. కొన్ని నెల‌ల కింద‌ట సినిమా టికెట్ల ధ‌ర‌ల గురించి ఒక కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్ ఏం మాట్లాడారో గుర్తుండే ఉంటుంది. పేద‌వాడి కోసం టికెట్ల రేట్లు త‌గ్గిస్తే దాని మీద కూడా దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని, త‌న‌ను త‌ప్పుబ‌డుతున్నార‌ని ఆయ‌న వాపోయారు.

క‌ట్ చేస్తే  సినీ ప‌రిశ్ర‌మకు చెందిన ప్ర‌ముఖులంతా వ‌చ్చి త‌న ముందు సాగిల ప‌డితే రేట్లు పెంచుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చేశారు. సాధార‌ణ స్థాయిలో రేట్లు పెంచ‌డ‌మే కాక‌.. ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద చిత్రాల‌కు అద‌నంగా కూడా రేట్లు పెంచుకునే ఛాన్సిచ్చారు. మ‌రి పేద‌వాడి కోసం రేట్లు త‌గ్గించామ‌న్న మాట‌లు ఇప్పుడేమ‌య్యాయో జ‌గ‌నే చెప్పాలి. ఇప్పుడు తాజాగా మ‌రో కార్య‌క్ర‌మంలో స్కూల్లో పిల్ల‌ల‌కు ఇచ్చే చిక్కీలకు క‌వ‌ర్ వేసి దాని మీద జ‌గ‌న్ ఫొటో వేయ‌డంపై వ‌స్తున్న‌పై జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో నాట‌కీయంగా మాట్లాడారు.

చిక్కీ చేతికి అంటుకుని ఇబ్బంది ప‌డ‌తార‌న్న ఉద్దేశంతో క‌వ‌ర్ వేస్తే దాన్ని కూడా ప్ర‌తిప‌క్షాలు త‌ప్పుబ‌డుతున్నాయ‌ని అన్నారు. కానీ చిక్కీకి ఎంత ఖ‌ర్చువుతోందో.. అంత‌కుమించి క‌వ‌ర్‌కు, దాని మీద జ‌గన్ ఫొటో ముద్రించ‌డానికి ఖ‌ర్చు అవుతుండ‌టాన్ని అంద‌రూ త‌ప్పుబ‌డుతున్నారు. ఇంత ప్ర‌చార యావా అని నిల‌దీస్తున్నారు. చార్ అణా కోడికి బారణా మ‌సాలా సామెత‌ను గుర్తు చేస్తున్నారు. దీని గురించి మాట్లాడ‌కుండా జ‌గ‌నేమో విష‌యాన్ని ప‌క్క‌దోవ ప‌ట్టిస్తూ నాట‌కీయ ప్ర‌సంగం చేశారు. దీని మీద సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్‌పై మామూలుగా ట్రోలింగ్ జ‌ర‌గ‌ట్లేదు. కొన్ని పాట‌ల‌ను సైతం చిక్కీ అనే ప‌దం జోడించి పేర‌డీలు చేస్తుండ‌టం విశేషం. జ‌గ‌న్ ఇప్ప‌టికైనా ఈ నాట‌కీయ‌త కొంచెం త‌గ్గించుకుంటే మంచిద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.