కేటీఆర్ రియాక్షన్… ఎంఐఎం కార్పొరేట‌ర్ అరెస్ట్‌

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీతో ఎంఐఎం మిత్ర‌ప‌క్షంగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. స‌హ‌జంగానే ఇరు పార్టీల మ‌ధ్య స‌ఖ్య‌త‌తో నేత‌ల్లో ఓ ధైర్యం ఉంటుంది. అలా ఒకింత ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో ర‌చ్చ చేసిన ఓ కార్పొరేట‌ర్‌కు చుక్క‌లు క‌నిపించాయి. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న పోలీసుల‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించిన హైద‌రాబాద్ భోల‌క్‌పూర్ ఎంఐఎం కార్పొరేట‌ర్ మ‌హ్మ‌ద్ గౌసుద్దీన్‌ను ముషీరాబాద్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. దీనికి కార‌ణం మంత్రి కేటీఆర్‌.

ముషీరాబాద్ భోల‌క్‌పూర్ డివిజ‌న్‌లోని ప‌లు ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజాము వ‌ర‌కు హోట‌ళ్లు, షాపులు తెరిచి ఉన్నాయి. దీంతో హోట‌ళ్ల‌ను, షాపుల‌ను మూసి వేయించేందుకు పోలీసులు అక్క‌డికి వెళ్లగా…పోలీసుల‌ను భోల‌క్‌పూర్ ఎంఐఎం కార్పొరేట‌ర్ మ‌హ్మ‌ద్ గౌసుద్దీన్ అడ్డుకున్నారు. వారితో దురుసుగా ప్ర‌వ‌ర్తించడ‌మే కాకుండా రంజాన్ మాసం ముగిసే వ‌ర‌కు రాత్రి పూట కూడా హోట‌ళ్లు, షాపులు తెరిచి ఉంటాయ‌ని తేల్చిచెప్పాడు. తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని.. సమయానికి హోటళ్లను మూసివేయాలని పోలీసులు చెప్పబోతే.. మీరు రూ. 100కు పనిచేసే మనుషులని స‌ద‌రు కార్పొరేట‌ర్ నోరు పారేసుకున్నాడు. ఈ వీడియో సోష‌ల్  మీడియాలో వైర‌ల్ అయింది.

విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న పోలీసుల ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించిన ఓ కార్పొరేట‌ర్ వ్య‌వ‌హార శైలిని ఓ నెటిజ‌న్ మంత్రి కేటీఆర్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి దృష్టికి ట్విట్ట‌ర్ ద్వారా తీసుకెళ్లారు. పోలీసుల‌కు గౌర‌వం ఇవ్వ‌కుండా దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆ నెటిజ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. ఇలాంటి నిర‌క్ష‌రాస్యుల ప్ర‌వ‌ర్త‌న‌ను స‌హించ‌వ‌ద్ద‌ని కోరారు. ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ సీరియ‌స్‌గా స్పందిస్తూ.. ఆ వ్య‌క్తుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీకి ట్వీట్ చేశారు. విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం క‌లిగించిన వారిపై క‌ఠిన చర్య‌లు తీసుకోవాల‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డిని రాష్ట్ర మంత్రి కేటీఆర్ కోరారు. రాజ‌కీయ పార్టీల‌కు అతీతంగా ఎవ‌ర్నీ స‌హించేది లేద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు.

దీంతో ఎంఐఎం కార్పొరేట‌ర్  గౌసుద్దీన్‌పై 353, 506 IPC సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. అనంత‌రం ఆ కార్పొరేట‌ర్‌ను పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో పోలీసు స్టేష‌న్ వ‌ద్ద ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా ఎంఐఎం విష‌యంలో టీఆర్ఎస్ పార్టీని ప్ర‌తిప‌క్షాలు టార్గెట్ చేస్తుంటే ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్పందించ‌క‌పోయినా… మంత్రి కేటీఆర్ మాత్రం రియాక్ట‌య్యార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.