మందుబాబులంతా మహాపాపులంటోన్న సీఎం

భారత దేశంలోని ఏ రాష్ట్రమైనా మద్యం వల్ల వచ్చే భారీ ఆదాయంపై ఆధారపడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే సంక్షేమపథకాలకు పెట్టే నిధుల్లో సగానికి పైగా ఆబ్కారీ శాఖ నుంచే వస్తాయి. అందుకే, మద్య నిషేధం వంటి  వ్యవహారాల జోలికి వెళ్లడానికి చాలామంది సీఎంలు ఇష్టపడరు. మందుబాబులు కట్టే ట్యాక్స్ విలువ తెలిసిన చాలామంది సీఎంలు…వారిని పల్లెత్తు మాట అనరు. కానీ, మిగతా సీఎంలకు భిన్నంగా మందుబాబులపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ షాకింగ్ కామెంట్లు చేశారు.

మందు తాగే వారందరూ మహా పాపులని, అసలు మద్యం తాగే వాళ్లు భారతీయులే కాదని అసెంబ్లీ సాక్షిగా నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు పెను దుమారం రేపుతున్నాయి. బీహార్‌లో మద్యపాన నిషేధం కొనసాగుతోన్న నేపథ్యంలో బీహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు- 2022ను కఠినతరం చేస్తూ ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ బిల్లు తాజాగా గవర్నర్ ఆమోదం పొందడంతో ఇకపై మందుకొట్టి మొదటిసారి పట్టుబడితే జరిమానాతో పాటుగా ఒక నెల జైలు శిక్ష తప్పదు. ఈ క్రమంలోనే ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా నితీశ్ షాకింగ్ కామెంట్లు చేశారు.

మహాత్మా గాంధీ కూడా మద్యపానాన్ని వ్యతిరేకించారని, ఆయన సిద్ధాంతాలకు విరుద్ధంగా మద్యం సేవించే వారిని తాను భారతీయులుగా పరిగణించనని నితీశ్ వ్యాఖ్యానించారు. మద్యం సేవించడం హానికరం అని తెలిసిన కొందరు సేవిస్తున్నారని, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని అన్నారు. మద్యపానం వల్ల జరిగే పర్యవసానాలకు వారే బాధ్యులని , మందు విషంతో సమానమని తెలిసినా తాగుతున్నారని మండిపడ్డారు. వీరి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, మద్యం తాగి మరణించిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోదని తేల్చి చెప్పారు.

బీహార్ లో మద్య నిషేధం అమల్లో ఉన్నప్పటికీ కల్తీ మద్యం, కల్తీ సారాయి విరివిగా దొరుకుతోంది. ఆ మద్యం వల్ల అక్కడ అనేక విషాదకర ఘటనలు జరుగుతున్నాయి. దీంతో, తాజాగా చట్టాలను మరింత కఠినతరం చేశారు. అయితే, నితీశ్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మద్య నిషేధాన్ని అమలు చేయడంలో నితీశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.