చ‌రిత్ర‌లోనే తొలిసారి.. 8 మంది ఐఏఎస్‌ల‌కు జైలు శిక్ష‌

దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారి.. ఇక‌, న‌వ్యాంధ్ర హిస్ట‌రీలోనే.. ఫ‌స్ట్ టైం.. గ‌తంలో ఎక్క‌డా ఎప్పుడూ.. క‌నీ వినీ ఎరుగ‌ని సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్రంలోనూ.. జ‌ర‌గ‌ని.. ఏరాష్ట్రంలోనూ.. ఇలాంటి ప‌రిణామం.. ఎదురుకాని ప‌రిస్థితి ఏపీలో ఏర్ప‌డింది. ఒకేసారి.. ఎనిమిది మంది సీనియ‌ర్ ఐఏఎస్‌ల‌కు.. ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. సీనియ‌ర్ ఐఏఎస్ అదికారులు.. విజయ్ కుమార్, శ్యామల రావు, గోపాల కృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మీ, గిరిజా శంకర్, వాడ్రేవు చిన వీరభద్రుడు, ఎం ఎం నాయక్ ల వైఖరిని కోర్టు ధిక్కరణగా భావిస్తున్న‌ట్టు రాష్ట్రహైకోర్టు స్ప‌ష్టం  చేసింది.

విష‌యం ఏంటంటే..

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చారు. ఈ క్ర‌మంలో గ్రామ, వార్డు స‌చివాల‌యాల‌ను ఏర్పాటు చేశారు.. ఇది మంచిదే అయినప్ప‌టికీ.. వీటికి సంబంధించిన కార్యాల‌యాల ఏర్పాటులో మాత్రం ప్ర‌బుత్వం ఎక్క‌డా నిబంధ‌న‌లు పాటించ‌లేదు. పాఠ‌శాల‌ల్లో సైతం స‌చివాల‌యాల‌ను ఏర్పాటు చేశారు. దీనిపైఏడాది కింద‌టే ప‌లువురు కోర్టును ఆశ్ర‌యించారు. దీంతో ఆయా అంశాల‌పై విచార‌ణ జ‌రిపిన కోర్టు.. స్కూళ్ల‌లో స‌చివాల‌యాల ఏర్పాటును తిర‌స్క‌రించింది. మూడు మాసాల్లో వాటిని తీసేసి.. పాఠ‌శాల‌ల‌ను కేవ‌లం విద్యార్థుల‌కు మాత్ర‌మే కేటాయించాల‌ని సూచించింది.

అయితే. ఎన్నాళ్లు గ‌డిచినా.. ఈ నిర్ణ‌యంపై అధికారులు చ‌ర్య‌లు తీసుకోలేదు. దీంతో మ‌రోసారి కోర్టులో ధిక్క‌ర‌ణ వ్యాజ్యం ప‌డింది. దీనిని కూడా రెండు ద‌ఫాలుగా విచారించిన కోర్టు గ‌తంలోనే విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీగా ఉన్న బుడితి రాజ‌శేఖ‌ర్‌ను కోర్టుకు పిలిపించి మ‌రీ హెచ్చరించింది. అయిన‌ప్ప‌టికీ.. మార్పు రాలేదు. దీంతో తాజాగా జ‌రిగిన విచార‌ణ‌లో విద్యా వ్య‌వ‌స్థ‌ల‌కు సంబంధించిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటూ.. ఆదేశాలు జారీ చేసింది.

కోర్టుకు క్ష‌మాప‌ణ‌లు..

8 మంది ఐఏఎస్‌ల‌కు…రెండు వారాలపాటు హైకోర్టు  జైలు శిక్ష విధించ‌డంతో వారంతా.. కోర్టుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. క్షమాపణలు కోరడంతో జైలు శిక్ష తప్పించిన కోర్టు వారిని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. సంక్షేమ హాస్టళ్లల్లో ప్రతి నెలలో ఓ రోజు వెళ్లి సేవ చేయాలని ఆదేశించింది. అంతేకాదు.. ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఐఏఎస్‌లకు హైకోర్టు తెలిపింది. ఇది రోజుకు రూ.5 ల‌క్ష‌ల‌కు పైగానే ఉంద‌ని తెలిసింది. మొత్తానికి ఈ తాజా తీర్పు ప్ర‌భుత్వానికి.. ప్ర‌భుత్వ న‌నిర్ణ‌యాల‌ను గుడ్డిగా అమ‌లు చేస్తున్న అధికారుల‌కు కూడా చెంప‌పెట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.