కొత్త జిల్లాల ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్‌

ఏపీలో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య నూతన జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. వాలంటీర్ల సేవలకుగాను ఏప్రిల్‌ 6న ప్రభుత్వం సత్కారం చేయనుంది. ఏప్రిల్‌ 8న వసతి దీవెన కార్యక్రమం చేపట్టి.. ఆయా కార్యక్రమాలను సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ సంద‌ర్భంగా.. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. తాజాగా.. జ‌గ‌న్‌.. ఆయా విష‌యాల‌పై స‌మీక్షించారు.

కొత్త జిల్లాలపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాలపై అందిన ఫిర్యాదులు, సూచనలు, సలహాలపై చర్చించారు. ప్రభుత్వం కొత్త జిల్లాలు ప్రకటించిన తర్వాత పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జిల్లాల పేరు మార్పు, జిల్లా కేంద్రం మార్పు.. పలు గ్రామాలను వేరే జిల్లాలో కలపడం వంటి డిమాండ్లు తెరపైకి వచ్చాయి. 4 నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానున్న నేపథ్యంలో.. జిల్లాల ఏర్పాటుపై రెండు రోజుల్లో తుది నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్దేశించిన గడువు దగ్గర పడుతుండటంతో ప్రతిపాదించిన జిల్లాల్లో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ప్రభుత్వం నుంచి ఒకట్రెండు రోజుల్లో ప్రకటన వెలువడనుండటంతో అప్పటికల్లా ఏర్పాట్లు పూర్తి చేసేలా అధికారులు శ్రమిస్తున్నారు. బాపట్ల కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లా కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 6 నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది.

మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతో పాటు మరికొన్ని ప్రధాన శాఖల కార్యాలయాల కోసం భవనాలు ముస్తాబవుతున్నాయి. ఇదిలావుంటే, పద్మావతి నిలయంలో కలెక్టరేట్ ఏర్పాటుపై.. జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌, హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలపై స్టే కు.. జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. తాత్కాలికంగా కలెక్టరేట్‌ ఏర్పాటుకు అభ్యంతరం ఎందుకని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి ఎదురు లేకుండా పోయింది.