చంద్రబాబు కోరిక తీర్చిన జగన్

చంద్రబాబునాయుడు కోరికను జగన్మోహన్ రెడ్డి తీర్చేశారు. ఇంతకీ ఆ కోరిక ఏమిటంటే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ పేరుతో కొత్తగా రెవిన్యు డిజన్ను ఏర్పాటు చేయటం.  ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచుతున్నది. ఇందులో భాగంగానే 73 రెవిన్యు డివిజన్లను కూడా కొత్తగా ఏర్పాటుచేసింది.

వీటిల్లో కుప్పం రెవెన్యూ డివిజన్ కూడా ఒకటి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మొదలవ్వగానే కుప్పంను రెవెన్యూ డివిజన్ గా చేయాలని చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రజలు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్న విషయం తన లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. ఆ లేఖను, కుప్పం ప్రజల డిమాండ్ ను జగన్ పరిగణలోకి తీసుకుని అధికారులకు అవసరమైన ఆదేశాలిచ్చారు.

దాంతో  6 మండలాలతో కొత్తగా కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటయ్యింది. తమ డిమాండ్ ఇంత తొందరగా ప్రభుత్వం నెరవేర్చుతుందని బహుశా కుప్పం జనాలు కూడా ఊహించుండరు. ఇదేకాదు జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కుప్పం మేజర్ నగరపంచాయితీని మున్సిపాలిటిగా మార్చిన విషయం తెలిసిందే. మేజర్ పంచాయితీని మున్సిపాలిటీగా మార్చాలని జనాలు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల దీర్ఘకాల డిమాండును దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం రాగానే కుప్పం మేజర్ పంచాయితీని మున్సిపాలిటీగా మర్చేశారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. నిజానికి 35 సంవత్సరాలుగా కుప్పం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు జనాల డిమాండ్ కు అనుగుణంగా మేజర్ పంచాయితీని మున్సిపాలిటీగా మర్చుండాలి. అలాగే కుప్పం రెవిన్యు డివిజన్  చేసుండాలి. తన చేతిలో ఉన్న రెండుపనులను చేయకుండా వదిలేయటమే విచిత్రంగా ఉంది. అందుకనే అధికారంలోకి రాగానే జగన్ ప్రజల డిమాండ్ ను వెంటనే నెరవేర్చేశారు.