ఏపీ సలహదారుగా నోబెల్ గ్రహీత?

ఆంధ్రప్రదేశ్ తో కలిసి పనిచేయటానికి మరో ఆర్ధికవేత్త ఎస్తేర్ డఫ్లో రెడీ అయ్యారు. ఈమె ప్రఖ్యాత ఆర్ధికవేత్తే కాకుండా నోబెల్ పురస్కార గ్రహీత కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఎస్తర్ పనిచేయనున్నారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మరి ఎస్తర్ ఏ స్ధాయిలో పనిచేస్తారు ? ఆమె ఇవ్వబోయే సూచనలు, సలహాలు ఏమిటి ? అవి ప్రభుత్వానికి ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయాలు ఎవరికీ అర్ధం కావటం లేదు.

ఎందుకంటే ఎస్తర్ ప్రత్యేకంగా ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఏమిటో తెలీదు. నిజానికి ఏ ఆర్ధికవేత్త కూడా అద్యయనం చేయలేనంత అధ్వాన్న స్థితిలో ఉంది రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి. 2014లో రాష్ట్రం ఏర్పడటమే రు. 16 వేల కోట్ల లోటుతో మొదలైంది. ఆస్తులన్నీ తెలంగాణకే పోవడంతో మళ్లీ పునర్మిర్మాణం కోసం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కొంత అప్పు చేయక తప్పలేదు. ఇపుడు జగన్మోహన్ రెడ్డి తన ఓట్లు భద్రపరుచుకోవడం కోసం  లక్షల కోట్లు అప్పులు చేసి సంక్షేమానికి పెడుతున్నారు. కనీసం ఆస్తుల నిర్మాణమూ చేయడం లేదు. పైగా ప్రభుత్వానికి చెందిన ఆస్తులను కుదవ పెట్టేస్తున్నారు.

అభివృద్ధి కన్నా సంక్షేమ పథకాలకు జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం అందరు చూస్తున్నదే. అభివృద్ధికి మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఏ ప్రభుత్వం కూడా ఆర్ధికంగా కోలుకోలేదు. చంద్రబాబు హయాంలో ఎంతో కొంత పుంజుకున్న రాష్ట్రం కొన్ని అడుగులు ముందుకు వేసింది. జగన్ వచ్చాక దానిని కొనసాగించకుండా నవరత్నాలపై పడ్డారు.  ఎక్కడపడితే అప్పులు చేస్తు ప్రభుత్వం నెట్టుకొస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఎస్తర్ కాదు కదా ఇంకో పదిమంది నోబెల్ గ్రహీతలైనా రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని చక్క దిద్దలేరు.

ఆర్ధిక పరిస్ధితి బాగుపడాలంటే ముందు పాలకుల ఆలోచనల్లో మార్పు రావాలి. పాలకులకు ఆర్ధిక క్రమశిక్షణ లేనపుడు ఎంతమంది ఎస్తర్లు వచ్చినా ఉపయోగం ఉండదు. ఇప్పటికే ప్రభుత్వానికి సలహాలివ్వటానికి ఐఏఎస్ అధికారులున్నారు, సలహాదారులున్నారు. వీళ్ళంతా ఎలా అప్పులు తీసుకురావాలనే విషయాలపై మార్గాలు వెతికి సలహాలిస్తున్నారు. కానీ ఎస్తర్ అలాంటి పనిచేయరేమో. ఆర్ధిక వ్యవస్ధను గాడిలోపెట్టడానికి సలహాలిస్తారేమో. మరా సలహాలు ప్రభుత్వం పాటిస్తుందా ? జగన్ కు నచ్చుతుందా ? చూద్దాం ఎస్తర్ ఏమి చేస్తారో ?