ప్ర‌ధానికి ఎంపీ RRR లేఖ‌.. సీఎంను ప్ర‌శ్నించాల‌ని డిమాండ్‌

ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోడీకి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అలియాస్ ఆర్ ఆర్ ఆర్ సంచ‌ల‌న‌ లేఖ రాశారు. ఒక పనికోసం తెచ్చిన అప్పులు ఇతర పనులకు వాడటం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. రుణాలు ఇచ్చిన బ్యాంకులు, అధికారులపై చర్చలు తీసుకోవాలని ప్రధానిని కోరానని తెలిపారు. సీఎం జగన్, సీతయ్యలాగా వ్యవహరిస్తున్నారని, ఆయన ఎవరి మాట వినరని విమర్శించారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలో విశాఖలో స్థలాలకు కన్నాలు వేస్తున్నారని లేఖలో రఘురామకృష్ణరాజు తెలిపారు.

ఏపీ ఆర్థిక స్థితిపై కాగ్ లెక్కలను పరిగణనలోకి తీసుకుని.. ఎస్‌ఎఫ్‌ఐవో లేదా సీబీఐ ఆర్థిక నేర విభాగంతో విచారణ చేపట్టాలని ఆర్ ఆర్ ఆర్ ప్ర‌ధానిని కోరారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి వేల కోట్లు సేకరించడంపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. విచారణ వేళ సీఎంను ప్రశ్నించాలనే నిబంధన విధించాలని రఘురామకృష్ణరాజు లేఖలో కోరారు. అప్పులు తీసుకునేటపుడు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఎంపీ.. కార్పొరేషన్ల ద్వారా ఎలా సేకరించారో విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్రంలో అకౌంటింగ్‌లో జరిగిన అవకతవకలపై కాగ్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింద‌ని లేఖ‌లో పేర్కొన్నారు.

“అసెంబ్లీ ఆమోదం పొందకుండానే ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసిందని కాగ్‌ తేల్చింది. ట్రెజరీ కోడ్‌ను పాటించకుండా ఖాతాల నుంచి డబ్బు డ్రా చేయడాన్ని ప్రభుత్వం తప్పుపట్టింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కొన్ని డిమాండ్ నోట్స్ మరియు కేటాయింపులు ఇంకా అసెంబ్లీ ఆమోదం పొందలేదని కాగ్ గుర్తించింది. వ్యయంలో, రాష్ట్ర ఆర్థిక శాఖ అవసరమైన వివరణ, సమర్థనను అందించడంలో విఫలమైందని కాగ్ పేర్కొంది“ అని లేఖ‌లో ర‌ఘురామ పేర్కొన్నారు.

కాగ్ పరిశీలనల ఆధారంగా,  కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విభాగాల ద్వారా సరైన విచారణను చేప‌ట్టాల‌ని ఆయ‌న ప్ర‌ధానిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొత్తం లెక్కలు మరియు కాగ్ ఆరోపణలను తనిఖీ చేయడానికి ఫోరెన్సిక్ ఆడిట్‌ను కూడా చేప‌ట్టాల‌న్నారు. కాగా, గ‌త రెండేళ్లుగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ర‌ఘురామ ప్ర‌శ్నిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఒకానొక ద‌శ‌లో ఆయ‌న‌ను సీఐడీ అరెస్టు చేయ‌డం.. త‌మ నిర్బంధంలో ఆయ‌న‌ను కొట్ట‌డం.. వంటి వి కూడా సంచ‌ల‌నంగా మారాయి. ప్ర‌స్తుతం ఆయ‌న రాసిన లేఖ‌పై మోడీ ఎలాంటి నిర్న‌యం తీసుకుంటారో చూడాలి. గ‌తంలో నూ మోడీకి ఆర్ ఆర్ ఆర్ లేఖ రాశారు. దీనిపై అప్ప‌ట్లో మోడీ.. ఏపీ స‌ర్కారును వివ‌ర‌ణ కోరిన విష‌యం తెలిసిందే.