కాపులపై బీజేపీ కన్ను పడిందా?

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా కాపుల ఓట్లను తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. కర్నూలు జిల్లా అహోబిలంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాలకు చెందిన బలిజల సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఉభయగోదావరి, కోస్తా జిల్లాల్లో కాపులని, రాయలసీమ జిల్లాల్లో బలిజలని అంటారు. కొద్దిరోజులుగా కాపుల ఓట్లన్నింటినీ బీజేపీ వైపు మళ్లించేందుకు కమలనాథులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

కాపు సామాజిక వర్గం నేతలు కానీ ఓటర్లు కానీ ఒక పార్టీతో ఎప్పుడూ లేరు. తమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, తమకు ఇచ్చే ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని కాపు నేతలు వివిధ పార్టీల్లో కంటిన్యూ అవుతున్నారు. అయితే ఎవరే పార్టీల్లో కంటిన్యూ అవుతుంది అది కాంగ్రెస్-టీడీపీ మధ్య మాత్రమే జరుగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాపు సామాజిక వర్గం ఓట్లు వైసీపీ-టీడీపీ గా మారింది. కాపులకు రాజ్యాధికారం అని ఎన్నిసార్లు చెప్పుకున్నా ఐకమత్యం లేని కారణంగా సాధ్యం కావడం లేదు.

కాపు నేతల్లో చాలామంది ఇటు వైసీపీ అటు టీడీపీలో కంటిన్యూ అవుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఇపుడు మూడో పార్టీగా బీజేపీ ఎంటరవుతోంది. అందుకనే వ్యూహాత్మకంగా కాపు నేత అయిన సోము వీర్రాజును అధ్యక్షుడిని చేసింది. ఇంతకు ముందున్న కన్నా లక్ష్మీనారాయణ కూడా కాపే అయినప్పటికి కాపులను బీజేపీ వైపు తీసుకురావటంలో ఫెయిలయ్యారు. ఇంకో పాయింట్ ఏమిటంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకోవడం కూడా కాపుల ఓట్ల కోసమే.

ఇపుడు కాపులకు 5 శాతం రిజర్వేషన్ అంశాన్ని బీజేపీ పదే పదే ప్రస్తావిస్తున్న కారణం కూడా ఇదే. కాపులను గనుక ఆకర్షించగలిగితే ఓట్లతో పాటు సీట్లను కూడా సంపాదించుకోవచ్చన్నది బీజేపీ నేతల వ్యూహం. అయితే ఇందులో కమలనాథులు ఎంతవరకు సక్సెస్ అవుతారో తెలీదు. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తోంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మరోవైపు వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేస్తోంది. ఇంకోవైపు కాపులను తమకు మద్దతుగా నిలబడేట్లు రిజర్వేషన్ పేరుతో  దువ్వుతోంది. కాబట్టి బీజేపీ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాల్సిందే.